వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 8 : సాగుకు ఉపయోగపడే కీటకాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలని ఇండియన్ ఎకలాజికల్ సొసైటీ లూథియానా, అధ్యక్షుడు డా.అశోక్ కేధావన్ అన్నారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మూడురోజుల పాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అశోక్ కేధావన్ మాట్లాడుతూ పంటలు, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అన్ని విభాగాల శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పంటలకు సేంద్రియ ఎరువులనే వాడాలన్నారు. ఎంటమాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.ఎస్,ఎస్ పూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోఎన్ఐపీహెచ్ఎం డైరెక్టర్ జనరల్ డా.హనుమాన్ సింగ్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా.సీమా, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.శరత్బాబు, వివిధ రాష్ర్టాలకు చెందిన దాదాపు 100మందికి పైగా శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.