సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత తెలిపారు. బుధవారం ఆమె కార్యాలయంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, కార్మిక శాఖ, శిశు సంక్షేమ కమిటీ, బచ్పన్ బచావో ఆందోళన్, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్ నెల రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. గత సంవత్సరం 1072 మంది వీధి బాలలను రెస్క్యూ చేసి హోమ్కు తరలించామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే సైబరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆపరేషన్ స్మైల్లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ సమావేశంంలో రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకట్రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ సృజన, బచ్పన్ బచావో ఆందోళన్ ఇన్చార్జి వెంకటేశ్వర్లు, వైద్యాధికారిణి డాక్టర్ శైలజ, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘స్కూల్ సేఫ్టీ క్లబ్’ను ప్రారంభించిన డీసీపీ
శేరిలింగంపల్లి, జనవరి 4 : ఆడపిల్లలు అన్ని వేళల ధృడ నిశ్చయంతో ధైర్యంగా ముందుకు సాగాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. బుధవారం గౌలిదొడ్డిలోని తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్లో ‘స్కూల్ సేఫ్టీ క్లబ్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలు ధైర్యంగా ఉంటూ దృఢనిశ్చయంతో ముందుకు సాగాలన్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న సమయంలో వయస్సు చాలా ముఖ్యమైనదని, చాలా జాగ్రత్తగా ఉంటూ అదే తరహాలో ఆలోచిస్తూ ఉత్తమ నిర్ణయాలను తీసుకోవాలన్నారు.
ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ఉన్నత లక్ష్యం వైపు తీసుకువెళ్ళేలా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు ఫిజికల్, వర్చువల్గా మంచి చెడులను గుర్తించగలగాలన్నారు. ఉత్తమ లక్ష్యాలను ఎంచుకుని మరింతమంది మహిళలకు తోడ్పాటునిచ్చేలా ఎదగాలన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. స్కూల్ సేఫ్టీ క్లబ్కు ప్రిన్సిపాల్ శారదా, వైస్ ప్రిన్సిపాల్ వాసవిలు కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్సీ ప్రతినిధులు రాజేంద్రప్రసాద్, గాయత్రి, గచ్చిబౌలి ఎస్ఐ రాధాక్రిష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.