మేడ్చల్, డిసెంబర్11(నమస్తే తెలంగాణ) : గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో అధికారులు ఆఫ్లైన్ సేవలకు స్వస్తి పలికి ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. గ్రామపంచాయతీ చుట్టూ తిరుగకుండా ఎక్కడ నుంచైనా జనన, మరణ ధ్రువపత్రాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే జనన, మరణ ధ్రువపత్రాలను ఆన్లైన్ ద్వారా అందిస్తారు. గ్రామ పంచాయతీల్లో 20 రోజుల నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన తరువాతే కార్యదర్శి డిజిటల్ సంతకం చేస్తారు. డిజిటల్ సేవలతో పారదర్శకంగా జనన, మరణ ధ్రువపత్రాలు అందనున్నాయి.
నేరుగా దరఖాస్తుదారుడికి సమాచారం
దరఖాస్తు చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు సిద్ధం కాగానే మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. వెంటనే దరఖాస్తుదారుడు మీ సేవకు వెళ్లి ధ్రువ పత్రం తీసుకోవచ్చని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సౌకర్యంగా మారిందని మేడ్చల్ డీపీవో రమణమూర్తి పేర్కొన్నారు. ఆన్లైన్ సేవల్లో ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.