చార్మినార్, జనవరి 5 : నగర అభివృద్ధితో పోటీ పడుతూ పాతనగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తూ జాతీయ రహదారులు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి. ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రయాణాలను మరింత సులభతరం చేస్తున్న రహదారులపై కొత్త వంతెనలతో ట్రాఫిక్ చిక్కుముళ్లను దూరం చేస్తున్నాయి. ఓల్డ్సిటీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవడానికి కొత్త కనెక్టివిటీ కోసం మరో వంతెన అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కృషిచేస్తున్నారు.
శరవేగంగా ఫ్లై ఓవర్ పనులు..
శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో నిర్మించ తలపెట్టిన కొత్త ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జూ పార్క్ సమీపం నుంచి ప్రారంభం కానున్న పై వంతెన 5 కి.మీ.దూరంలోని ఆరాంఘర్ పి.వి.ఎన్.ఆర్. ఫ్లై ఓవర్ వద్ద ముగియనుంది. విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు నగరం నుంచి సులువైన కనెక్టివిటీ కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో పిల్లర్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ఫ్లై ఫ్రీ కన్స్ట్రక్షన్ తరహాలో ఫిల్లర్స్ క్లిప్పింగులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మరో 6 నెలల వ్యవధిలో ఫ్లై ఓవర్ నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కృషిచేస్తున్నారు.
రెండు ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకువస్తాం..
ఈ సంవత్సరంలో రెండు ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే పాతనగరంలో కాంచన్బాగ్, ఉప్పుగూడ, కందికల్గేట్, బహదూర్పురా, చాంద్రాయణగుట్ట, డబీర్పురా, మలక్పేట్, బుద్వేల్ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. వాటితోపాటు ప్రస్తుతం ఐఎస్ సదన్ క్రాస్ రోడ్డు నుంచి మలక్పేట్ వరకు స్టీల్ ైబ్రిడ్జ్ ఫ్లె ఓవర్, జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి
– సామ్రాట్ అశోక్, చార్మినార్ జోనల్ కమిషనర్