Hyderabad | హైదరాబాద్ శివారు శంషాబాద్లో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. అర్ధరాత్రి సమయంలో గుడిసెలో పడుకున్న ఏడాది చిన్నారిని బయటకు లాక్కెళ్లి దాడి చేశాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. నిండు నూరేండ్ల జీవితం ఉన్న ఆ చిన్నారి.. వీధికుక్కలకు బలై.. ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్లోని సోమా ఎంక్లేవ్ సమీపంలోని ఓ గుడిసెలో సూర్యకుమార్ అనే వ్యక్తి తన భార్య, 15 నెలల కుమారుడితో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత సుమారు ఒంటి గంట ప్రాంతంలో గుడిసె దగ్గరకు వచ్చిన వీధికుక్కలు బాలుడిని బయటకు లాక్కెళ్లాయి. కాసేపటికే సూర్యకుమార్కు మెలకువ వచ్చి చూసేసరికి చిన్నారి కనబడలేదు. దీంతో కంగారు పడిన సూర్యకుమార్ బయటకు వచ్చి చూడగా.. బాలుడిని చుట్టుముట్టి కుక్కలు దాడి చేయడం కనిపించింది. వెంటనే ఆ వీధికుక్కలను తరిమికొట్టి తీవ్రంగా గాయపడిన కొడుకును ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. కానీ అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.