మాదాపూర్, జూలై 14: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమాన్ని మంగళవారం మాదాపూర్లో నిర్వహించారు. కూకట్పల్లి జోన్, మాదాపూర్ వార్డులో సీఎంసీ కమీషనర్ సృజన ,ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమీషనర్ నారాయణ అమిత్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్వయంగా పర్యటించారు. అనంతరం సిలికాన్ వ్యాలీ పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు, ప్రజలతో కమీషనర్గా ముఖాముఖి మాట్లాడారు.
అనంతరం కాలనీ ప్రతినిధుల నుండి వినతులను స్వీకరించి, మౌలిక వసతుల కొరతపై చర్చించారు. తాగునీరు, డ్రైనేజీ బోర్వెల్ల మరమ్మతులు, యూజీడి నెట్వర్క్ అప్గ్రేడేషన్, తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా, ట్యాంకర్ల సేవల క్రమబద్ధీకరణతో పాటు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, రోడ్లపై అక్రమ పార్కింగ్, ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపు, నిర్మాణ వ్యర్థాల తరలింపు వంటి వాటిపై ఫిర్యాదులు చేయగా వాటిని పరిష్కరిస్తామన్నారు.
పార్కులలో ఓపెన్ జిమ్లు, పిల్లల ఆట వస్తువుల ఏర్పాటు, పచ్చదనం పెంపొందించడం, పార్కుల పరిసరాల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచడం, ట్రాఫిక్ సమస్యల నియంత్రణ, చెత్తా చెదారం వేసే వారిపై కఠిన చర్యలు, హస్టళ్లలో నీటి వృధా, వ్యర్థాల నిర్వహణపై నిఘా, చందానాయక్ తండా స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలని వినతులు అందజేశారు. స్థానికులు లేవనెత్తిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎంసీ కమీషనర్ అన్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.