కుత్బుల్లాపూర్, జూన్ 28: మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన ఓ విద్యార్థి నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలికావడంతోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్మూర్కు చెందిన సాయికుమార్ మేడ్చల్ మైసమ్మగూడలో ఉన్న ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ విద్యా సంస్థలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
మంగళవారం రాత్రి నుంచి ఉదయం వరకు తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. ఇదిలా ఉండగా.. సూరారం సాయిబాబానగర్కు చెందిన షేక్ సాజిద్ (23)తో పాటు అదే ప్రాంతానికి చెందిన మణెమ్మ, శోభ మైసమ్మగూడలోని హిమాలయ పరిశ్రమలో పని చేస్తున్నారు. రోజువారీ పనిలో భాగంగా బుధవారం ఉదయం ఒకే ద్విచక్ర వాహనంపై సాజిద్, మణెమ్మ,శోభ పనిచేసే పరిశ్రమకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మైసమ్మగూడలోని చెరువు సమీపంలో అతివేగంతో ఎదురుగా దూసుకువచ్చిన సాయికుమార్ కారు సాజిద్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకాల కూర్చున్న ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.