కేబీఆర్ పార్క్ నుంచి కోకాపేట ఔటర్ వరకు..
రెండుచోట్ల లింకు కలిపితే ప్రయాణం సులువు
సుమారు 13 కి.మీ పొడవునా ప్రధాన రహదారి
100 ఫీట్ల మార్గం..ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం
భవిష్యత్తులో అత్యంత కీలకం కానున్న లింకు రోడ్డు
ఐటీ కారిడార్లో మరో పొడవైన మార్గం అందుబాటులోకి రానుంది. బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్(కేబీఆర్) నుంచి కోకాపేట ఔటర్ వరకు సుమారు 13 కి.మీ. పొడవునా 100 అడుగుల వెడల్పుతో విశాలమైన రహదారిగా మార్చేందుకు జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మైండ్స్పేస్ జంక్షన్ నుంచి రాంకీ టవర్ మీదుగా ర్యాడిసన్ వద్ద కలిసేలా ఒకటి, ర్యాడిసన్ హోటల్ నుంచి ఐఎస్బీ రోడ్డు వరకు అనుసంధానం అయ్యేలా మరో లింకు రోడ్డు నిర్మించనున్నారు. ఈ రెండు చోట్ల లింకు రోడ్లు నిర్మిస్తే 13 కి.మీ పొడవునా ప్రధాన రహదారిగా మారుతుంది.ఇది అందుబాటులోకొస్తే ఐటీ కారిడార్కు రాకపోకలు సులభతరమై సమయం ఆదా కానుంది. అంతేకాదు రెండు లింకులను కలపడం ద్వారా అందుబాటులోకొచ్చే ప్రధాన మార్గంపై ఈబీఆర్టీఎస్ను ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటుందని నిపుణుల అంచనా.
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : రెండు చోట్ల లింకులు కలిపితే చాలు ఐటీ కారిడార్లో అత్యంత కీలకమైన ప్రధాన రహదారి అందుబాటులోకి వస్తుంది. గణనీయంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 కేబీఆర్ పార్కు నుంచి కోకాపేట ఔటర్ రింగు రోడ్డు దాకా సుమారు 13 కి.మీ పొడవున విశాలమైన రహదారిగా మారుతుంది. హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున ఐటీ కంపెనీలతో పాటు 40-58 అంతస్తులతో కూడిన హైరైజ్ అపార్టుమెంట్లతో కూడిన నివాస ప్రాంత గేటెడ్ కమ్యూనిటీలు వస్తున్నాయి. దానికి తగట్టుగా రోడ్ల విస్తీర్ణంతో పాటు అడుగడుగునా జంక్షన్లు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోయేలా 100 అడుగులకు పైగా వెడల్పుతో కూడిన రోడ్లు అవసరం. ఈ నేపథ్యంలో దుర్గం చెరువు మీదుగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి మీదుగా మైండ్స్పేస్ జంక్షన్, డెలాయిట్, రాంకీ టవర్స్, గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్, డీఎల్ఎఫ్ సైబరీ సిటీ, త్రిబుల్ ఐటీ చౌరస్తా, ఐఎస్బీ, ఇన్ఫోసిస్, మైక్రోసాప్ట్, విప్రో చౌరస్తా మీదుగా కోకాపేట ఔటర్ రింగు రోడ్డు ఇంటర్చేంజ్ వరకు విశాలమైన రహదారి అందుబాటులోకి వస్తుంది.
ఆ రెండు చోట్ల లింకులు కలిపితే చాలు..
జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి నేరుగా కోకాపేట ఓఆర్ఆర్ వరకు ఉన్న మార్గంలో రెండు లింకులు కలపాల్సి ఉంది. ఇందులో మొదటిది మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి వచ్చే రోడ్డు ర్యాంకీ టవర్ మీదుగా గచ్చిబౌలి -కొండాపూర్ ప్రధాన రహదారిలో ర్యాడిసన్ వద్ద కలిసేలా లింకును కలపాల్సి ఉంది. ర్యాడిసన్ హోటల్ ముందు నుంచి డీఎల్ఎఫ్ సైబర్ సిటీ ముందు నుంచి త్రిబుల్ ఐటీ చౌరస్తా వరకు రోడ్డు ఉండగా, అక్కడి నుంచి ఐఎస్బీ రోడ్డుకు అనుసంధానం అయ్యేందుకు మరో లింకును కలపాల్సి ఉంటుంది. ఇలా ఈ రెండు చోట్ల 4 రోడ్ల కూడలితో లింకులను కలిపి ఒకేసారి 13 కి.మీ పొడవునా ప్రధాన రహదారిగా మారుతుంది. దీంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి నేరుగా కోకాపేట ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ వరకు అత్యంత కీలకమైన ప్రధాన రహదారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భవిష్యత్లో అత్యంత కీలకం కానున్న ఈ లింకు రోడ్డు..
పట్టణ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థతో పాటు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని (హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ)లు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కేపీహెచ్బీ నుంచి కోకాపేట ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఈబీఆర్టీఎస్)ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈ మార్గాన్ని ఈ రెండు లింకులు కలపడం ద్వారా అందుబాటులోకి వస్తున్న మార్గం మీదుగా ఈబీఆర్టీఎస్ను ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటుందని పట్టణ ప్రణాళికా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు, అదేవిధంగా హైరైజ్ అపార్టుమెంట్లు ఉండడంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది.