కొనసాగుతున్న కుడివైపు ఫ్లైఓవర్ పనులు
రూ.26.56కోట్లతో 780 మీటర్లలో నిర్మాణం
మహాల్ మైసమ్మ దేవాలయం మధ్యలో ఉండటంతో ఆలస్యమైన పనులు
ఆలయానికి 60 మీటర్ల ముందే ఫ్లైఓవర్ కుదింపు
వచ్చే జూన్ వరకు అందుబాటులోకి..
ఎల్బీనగర్, ఏప్రిల్ 17 : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ముఖద్వారమైన ఎల్బీనగర్లో సమగ్ర రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ జంక్షన్కు నూతన హంగులు సమకూరుతున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్లో ఇప్పటికే ఎడమవైపు ఫ్లై ఓవర్తో పాటుగా ఇన్నర్ రింగ్రోడ్డులో కుడి, ఎడమ అండర్పాస్ల నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఎల్బీనగర్ రైడ్ హ్యాండ్ సైడ్ ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా యుద్ధప్రాతిపదికన సాగుతోంది. ఈ ఫ్లై ఓవర్ పనులను 2019లోనే ప్రారంభించినప్పటికీ ఎల్బీనగర్ మహాల్ మైసమ్మ దేవాలయం రోడ్డు మధ్యలో రావడంతో ఏర్పడిన వివాదం మూలంగా పనులు ఆపేశారు. అయితే జూన్ 2021లో ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్కుమార్ ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని అటు దేవాదాయ శాఖ అధికారులతో.. ఇటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ కొలిక్కి రాలేదు.
మొదట మహాల్ మైసమ్మ దేవాలయం వెనుక భాగం నుంచి సరూర్నగర్ స్టేడియం వైపునకు నిర్మించాలని భావించినా మహాల్ మైసమ్మ దేవాలయం మధ్యలో ఉన్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ను మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శుల ఆదేశాల మేరకు దేవాలయం ముందుకే కుదించి నిర్మించాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి ఎల్బీనగర్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే మార్గంలో విజయలక్ష్మి థియేటర్ ముందు ప్రారంభమై ఎల్బీనగర్ మహాల్ మైసమ్మ దేవాలయానికి 60 మీటర్ల ముందు వరకు నిర్మిస్తున్నారు.
రూ. 26.56 కోట్లతో మూడు లేన్ల ఫ్లైఓవర్
ఎల్బీనగర్ జంక్షన్లో జాతీయ రహదారిపై ఇరువైపులా రాకపోకలు సాఫీగా సాగడానికి, సిగ్నల్ ఫ్రీ ప్రయా ణం కోసం నిర్మిస్తున్న సమగ్ర రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర కుడివైపు ఫ్లైఓవర్ నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. రూ.26.56 కోట్లతో నిర్మిస్తుండగా, ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం స్థల సేకరణకు వెచ్చించిన నిధులు అదనం. ఎల్బీనగర్ విజయలక్ష్మి థియేటర్ ముందు ఆరంభమై మహాల్ మైసమ్మ దేవాలయం కంటే 60 మీటర్ల ముందు ల్యాండ్ అవుతున్న ఈ ఫ్లైఓవర్ 780 మీటర్లు నిర్మాణం చేస్తున్నారు. 12 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లుగా ఫ్లై ఓవర్ నిర్మాణం కొనసాగుతున్నది. ఈ ఫ్లై ఓవర్కు మొత్తం 13 ఫౌండేషన్లు, 12 స్లాబ్లు వేయాల్సి ఉండగా, వాటిలో ఇప్పటివరకు 8 ఫౌండేషన్లు, స్లాబ్లు పూర్తి చేశారు. మిగిలిన నాలుగు డెస్క్ ల్యాబ్లు పెండింగ్లో ఉన్నాయి. వీటి నిర్మాణానికి గర్డర్ల్ పెట్టారు. స్లాబ్ పనులు, ఏవన్ ర్యాంపు పనులు పూర్తయితే ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి అందుబాటులోకి వస్తుంది. ఎల్బీనగర్ హనుమాన్ దేవాలయం వద్ద మహాల్ మైసమ్మ దేవాలయం మూడు లేన్ల ఫ్లై ఓవర్ను ప్రస్తుతానికి రెండు లేన్ల ఫ్లైఓవర్ మాత్రం పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు.
ట్రాఫిక్ ఫ్రీ కోసం ఫ్లైఓవర్లు అందుబాటులోకి..
ట్రాఫిక్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం ఎల్బీనగర్ జంక్షన్ సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో ఎస్ఆర్డీపీ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్లో ఇప్పటికే ఎడమవైపు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. కుడివైపు ఫ్లైఓవర్ కూడా జూన్ వరకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో మహాల్ మైసమ్మ దేవాలయం రోడ్డు మధ్యలో ఉండటంతో ఇబ్బందులు వచ్చాయి. అయితే ప్రజల అవసరాల దృష్ట్యా ఫ్లై ఓవర్ను కుదించి ముందుకు పరిమితం చేస్తూ నిర్మాణం చేస్తున్నాం. ఎల్బీనగర్ జంక్షన్ నుంచి చింతలకుంట అండర్పాస్ వరకు జాతీయ రహదారిని సుందరంగా తీర్చిదిద్దాం. ఇన్నర్ రింగ్రోడ్డులోనూ ఎల్బీనగర్లో రెండు అండర్పాస్లు, కామినేని వద్ద రెండు ఫ్లై ఓవర్లు, బైరామల్గూడ జంక్షన్లో రెండు ఫ్లై ఓవర్లు కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో అన్ని జంక్షన్లలో ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తే రోడ్లపై ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. – దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్