మాదాపూర్, ఫిబ్రవరి 15: ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ప్రయాణిస్తూ నిర్లక్ష్యం, అతి వేగంగా డ్రైవింగ్ చేసి చెట్టుకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన అజయ్ (27) బతుకుదెరువు కోసం వచ్చి.. విశాఖ ఇండస్ట్రీస్లో సేల్స్మన్గా ఉద్యోగం చేస్తూ బేగంపేటలోని పీజీ మెన్స్ హాస్టల్లో ఉంటున్నాడు.
గురువారం తెల్లవారుజామున అజయ్ జగిత్యాల జిల్లాకు చెందిన మరో ఇద్దరు స్నేహితులు శ్రీపాద శరత్, అందె అజయ్తో కలిసి ద్విచక్ర వాహనంపై ముగ్గురు మాదాపూర్లోని ఖానామెట్ నుంచి నోవాటెల్ వైపు బయలుదేరారు. మార్గమధ్యలో న్యాక్ ప్రధాన గేట్ వద్ద ఉన్న 7 సిస్టర్స్ రెస్టారెంట్ సమీపంలో అజయ్ వాహనాన్ని అతి వేగంగా డ్రైవింగ్ చేయడంతో.. అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీ కొట్టాడు. దీంతో అజయ్కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, శరత్, అందె అజయ్కి గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.