సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్ది అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువవుతున్నది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 21 సర్కిళ్లు ఉండగా, అందులో 9 సర్కిళ్లతో కూడిన గ్రేటర్లోనే 60 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీనికి తోడు ప్రతినెలా వేల సంఖ్యలో కొత్త విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరుగుతూనే ఉంది. గతేడాది మే నెలలో ఉన్న అత్యధిక రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం ఈ ఏడాది ఏప్రిల్ 18న నమోదైంది.
గతేడాది మే నెల 19న అత్యధికంగా రికార్డు స్థాయిలో 79 మిలియన్ యూనిట్లు నమోదైతే, ఏప్రిల్లోనే 85.38 మిలియన్ యూనిట్లు వినియోగించడం రికార్డుగా మారింది. ఈ ఏడాది వేసవిలో 85-90 మిలియన్ యూనిట్లు అంచనా వేసుకుంటే, అది ఏప్రిల్ మధ్యలోనే నమోదు కావడం విద్యుత్ శాఖ అధికారుల అంచనాలనే తారుమారు చేస్తున్నది. ఇంకా మే నెల వస్తే విద్యుత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన అధికారుల్లో మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగిస్తే విద్యుత్ వినియోగం గ్రేటర్ పరిధిలో 100 మిలియన్ యూనిట్ల వరకు చేరుకునే అవకాశం లేకపోలేదని అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ రంగం విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవహరించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ చుట్టూ రెప్పపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఉండేలా పవర్ ఐల్యాండ్ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రూ.14 వేల కోట్లతో సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతోనే ఈ స్థాయి విద్యుత్ డిమాండ్ ఉన్నా విద్యుత్ నెట్వర్క్ తట్టుకోగలుగుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా విద్యుత్ వినియోగం ప్రతియేటా 10-15 శాతం ఉంటే, ఈసారి 20శాతం దాటి ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది.
ఆ స్థాయిని తట్టుకునేలా గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ సరఫరా నెట్ వర్క్ను హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టకొని ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచేలా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. వేసవి కార్యాచరణలో భాగంగా బోయిన్పల్లి, సుభాష్నగర్, గంధంగూడ, జల్పల్లి ప్రాంతాల్లో 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఆయా సబ్ స్టేషన్లలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా 8ఎంవీఏ పీటీఆర్లను కందికల్గేట్, బాచుపల్లి, నారపల్లి, నందనవనం, కోకాపేట, ఫసిఫికా, నార్సింగి, కొత్తగూడలో ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు.