Hyderabad | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, ఆభరణాలు, డ్రగ్స్, మద్యంతో పాటు ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇక హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో కూడా పోలీసులు, మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పంచవటి అపార్ట్మెంట్స్లోని ఓ ఫ్లాట్ వద్ద రూ.1 కోటి విలువైన చీరలను డంపు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ నుంచి రెండు లారీల్లో చీరలను తీసుకువచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒక లారీలోని చీరలను అన్లోడ్ చేయగా, మరో లారీని సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.