హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య ప్రచారయాత్రను ఆదివారం ఆయన మినిస్టర్స్ క్వార్టర్స్లో జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యతపై ఏర్పాటు చేసిన సదస్సు, కవి సమ్మేళనంలో వినోద్కుమార్ మాట్లాడుతూ.. నీటిని సంరక్షిస్తేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. నీటి సంరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. మిషన్ కాకతీయ ద్వారా సుమారు 44 వేల చెరువుల్లో పూడికలు తీయించారని, తద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వివరించారు. కేంద్ర జల సంఘం లెకల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని భూగర్భంలో దాదాపు 500-600 టీఎంసీల నీటిని భద్ర పరిచినట్టు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను పంట పొలాలు, చెరువులు, కుంటలకు తరలించడం వల్ల గ్రౌండ్వాటర్ గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. నీటిని వృథా చేస్తే రేపటి తరానికి మిగిలేది కన్నీరేనని హెచ్చరించారు. అనంతరం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ప్రచురణలను వినోద్కుమార్ ఆవిషరించి కవులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్రెడ్డి, జలమండలి ఓఎస్డీ జాల సత్యనారాయణ, గాంధీ సంస్థల ప్రతినిధులు నాగసూరి వేణుగోపాల్, గిరిధర్గౌడ్, గోపాల్, గణేశ్గౌడ్, గాంధారి ప్రభాకర్, హర్దీప్రెడ్డి, రెండు తెలుగు రాష్ర్టాల కవులు పాల్గొన్నారు.