Chikoti Praveen | సైదాబాద్, మార్చి 2 : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కారును ఎత్తుకెళ్లిన నిందితులను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సైదాబాద్ డీఐ బండారు చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్ఘాట్కు చెందిన గుండె శివ ప్రసాద్ (24) అలియాస్ మెంటల్ శివ పాత నేరస్తుడు. నగరంలోని ఏడు పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన 13 కేసుల్లో నిందితుడు. ద్విచక్రవాహనం చోరీ కేసులో మూడు నెలల కిందట జైలుకు వెళ్లిన శివకు అక్కడే నేరేడ్మెట్కు చెందిన సమీత్నాయక్ (19), యేపూరి నిఖిల్ (23)తో పరిచయం ఏర్పడింది.
ఈ ముగ్గురు ఫిబ్రవరి 15వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చారు. వీరికి నేరేడ్మెట్కు చెందిన సతిక రాహుల్ (20), మల్లెల సాయికిరణ్ పరిచయం ఉన్నది. అందరూ కలిసి సులభంగా డబ్బులు సంపాదించి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 19వ తేదీన వీరంతా రెండు ద్విచక్రవాహనాలపై సైదాబాద్లో ప్రవీణ్ నివాసముంటున్న ఇంటికి వచ్చారు. ప్రవీణ్ డ్రైవర్లు కారును ఇంటి ముందు పార్కింగ్ చేసి, వాచ్మెన్ గదిలో తాళాలు పెట్టి వెళ్లిపోయారు.
ఇది గమనించిన దుండగులు వాచ్మెన్ గదిలోకి ప్రవేశించి కారు తాళాలు తీసుకొని కారుతో పరారయ్యారు. దొంగిలించిన కారుతో కీసరగుట్ట వద్ద జరిగిన జాతరకు వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో కారును ఆస్మాన్ఘడ్ తిరుమలహిల్స్లోని వేంకటేశ్వరాలయం వద్ద వదిలి పెట్టి వెళ్లారు. గుర్తించిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితుడు శివ పరారీలో ఉండగా, మిగతా నలుగురు సమీత్నాయక్, యేపూరి నిఖిల్, సతిక రాహుల్, మల్లెల సాయి కిరణ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ రూపేశ్, ఏసీపీ శ్యామ్సుందర్, ఇన్స్పెక్టర్ కె.సుబ్బరామిరెడ్డి, వెల్లడించారు.