శంషాబాద్ రూరల్, ఆగస్టు 4 : దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని సైబరాబాద్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగదీశ్వర్రెడ్డి వివరాలు వెల్లడించారు. అంబర్పేట ప్రాంతానికి చెందిన మునితాని అమర్ రాజ్కుమార్రెడ్డి(25) అలియాస్ డాల్ బైక్ మెకానిక్. మద్యానికి బానిసైన రాజ్కుమార్ తన మెకానిక్ షాపు ద్వారా వచ్చే సంపాదన సరిపోకపోవడంతో యాకుత్పురాకు చెందిన సల్మాన్, చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్తో కలిసి చైన్స్నాచింగ్, ఆటోమొబైల్ దోపిడీలకు పాల్పడటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో మీర్పేట, అంబర్పేట, మలక్పేట, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో 58కి పైగా నేరాలకు పాల్పడి పలు మార్లు జైలు శిక్ష అనుభవించాడు.
2021లో మీర్పేట పోలీసులు నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రయోగించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ సంవత్సరం మే 25న జైలు నుంచి విడుదలైన తరువాత తిరిగి తన ఇద్దరు అనుచరులతో కలిసి నేరాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో 10, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 19కేసుల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న శంషాబాద్ జోన్ పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి రూ.30లక్షలు విలువ చేసే 30తులాల బంగారం, 50తులాల వెండి ఆభరణాలు, ద్విచక్రవాహనాలు, ల్యాప్టాప్స్, ఖరీదైన కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.
మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆసిఫ్నగర్కు చెందిన అబ్దుల్ సమద్ అలియాస్ షకీల్, సబ్జిమండికి చెందిన మీర్జా రిజ్వనఝ్ బేగ్లు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టించి రూ.1200-రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరాంఘర్ చౌరస్తా వద్ద పట్టుకొని వారి నుంచి మొత్తం 67 ఇన్సూరెన్స్ పత్రాలు, ల్యాప్టాప్, రెండు సెల్ఫోన్లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారు.