Osmania Hospital | హైదరాబాద్ : మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ కడుపులో ఉన్న 7 కేజీల అండాశయ తిత్తిని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. మహారాష్ట్ర ఉద్గిర్కు చెందిన వందన గత ఎనిమిది నెలల నుంచి కడుపు ఉబ్బరంతో బాధపడుతుంది. వాపు కూడా తీవ్రంగా రావడంతో.. ఈ ఏడాది మే 4వ తేదీన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులను వందన సంప్రదించింది.
దీంతో ఆమెకు సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్లు నిర్వహించారు. గర్భాశయంలో తిత్తి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సర్జరీ తక్షణమే చేయకపోతే.. బాధితురాలికి ప్రమాదం పొంచి ఉందని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి అనుమతితో ఆమెకు మే 27వ తేదీన శస్త్ర చికిత్స నిర్వహించి, 7 కేజీల అండాశయ తిత్తిని తొలగించారు. ఈ తిత్తిని తొలగించేందుకు వైద్యులు 4 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.
ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉస్మానియా వైద్యులు ప్రకటించారు. డాక్టర్ బీ రాజు ఆధ్వర్యంలో డాక్టర్ హరిత, డాక్టర్ వినయ దీప, డాక్టర్ వెంకటేశ్వర్ రావు, డాక్టర్ రహ్మన్, డాక్టర్ ప్రియాంక శస్త్ర చికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఆ వైద్య బృందాన్ని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ అభినందించారు.