సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా పరిధిలోని మేడిపల్లిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లో ఖాళీ ప్లాట్ల విక్రయం కోసం సోమవారం జరిగిన ప్రీ బిడ్ సమావేశం విజయవంతమైందని అధికారులు తెలిపారు. మొత్తం 55 ఎకరాల లేఅవుట్లో 400 ప్లాట్లు ఉండగా, మొదటి దశలో 50 ప్లాట్లను(ఒక్కొక్కటి 300 గజాల విస్తీర్ణం) విక్రయిస్తున్నది. సోమవారం మేడిపల్లి సైట్లో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో హెచ్ఎండీఏ అధికారులు, ఆన్లైన్ వేలం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు లేఅవుట్కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంజనీరింగ్, ఎస్టేట్ అధికారులు మేడిపల్లి లే అవుట్ ప్రాధాన్యతను వివరించారు. మార్చి 6వ తేదీన ఉద యం, మధ్యాహ్నం వేళల్లో అన్ లైన్ వేలం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి కీసర ఆర్డీఓ రమేశ్, మే డిపల్లి తహసీల్దార్ మణిపాల్ రెడ్డి, హెచ్ఎండిఏ ఎస్ఇ హుస్సేన్, ప్లానింగ్ ఆఫీసర్ (పిఓ) ప్రభాకర్ రెడ్డి, ఎస్టేట్ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, డిఏఓ శోభ హాజరయ్యారు.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు సంబంధించి బండ్లగూడ(నాగోలు), పోచారం ప్రాంతాల్లో నిర్మించిన అపార్టుమెంట్లలో మిగిలిపోయిన ట్రిపుల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్ ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3న లాటరీ నిర్వహిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్స్గా డిమాండ్ డ్రాఫ్టులు కట్టిన వారు మాత్రమే ఈ లాటరీకి అర్హులని తెలిపారు. మార్చి 3వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి జరిగే లాటరీని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, దరఖాస్తు దారులు ఆన్లైన్లో ప్రత్యక్షంగా యూట్యూబ్, ఫేస్ బుక్ మాధ్యమాల ద్వారా చూడవచ్చని తెలిపారు.