సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులో ఉన్న మెట్రో రైళ్ల వ్యవస్థ నిరంతరం ఆధునికంగా ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో అత్యంత కీలక మార్గాల్లో ఉన్న మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల ఆదరణను చూరగొన్న మెట్రో వ్యవస్థ నిర్వహణలో ఎల్ అండ్ టీ మెట్రోతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సైతం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పూర్తిగా ఆకాశ మార్గం (ఎలివేటెడ్)లో మెట్రో మార్గంలో ఉన్న స్టేషన్లతో పాటు రోడ్డు మీద పిల్లర్లు, వాటి మధ్య ఉన్న డివైడర్లను నిరంతరం శుభ్రంగా ఉంచే కార్యాచరణను అధికారులు చేపట్టారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్ల కింద ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని ప్రతి రోజూ ఊడ్చుతూ పరిశుభ్రంగా ఉంచే పనులను ప్రైవేట్ హౌస్ కీపింగ్ సంస్థలకు అప్పగిస్తున్నారు. అన్ని మెట్రోస్టేషన్లు ఒక్కరికే కాకుండా 3-5 మెట్రో స్టేషన్లను ఒకరికి అప్పగిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్ల కింద పరిశుభ్రత పక్కాగా ఉండేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా కారిడార్-3లోని మధురానగర్ (తరుణి మెట్రో స్టేషన్) నుంచి మొదలుకొని యూసుఫ్గూడ, కృష్ణానగర్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ . 5 మెట్రో స్టేషన్ వరకు ఉన్న మార్గాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచే పనులను హౌస్ కీపింగ్ సంస్థలకు ఇచ్చేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. మొత్తం 69 కి.మీ పరిధిలో 3 కారిడార్లలో ఉన్న మెట్రో మార్గాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో రైలు నగర వాసులకు అందుబాటులో ఉండేలా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.