మేడ్చల్, నవంబరు 29 : ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కీసర మండలం బోగారంలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపి ణీ కేంద్రం నుంచి నియోజకవర్గంలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. ఈవీఎంలతో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి కాగా, మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్ తర్వాత రెండో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం. నియోజకవర్గంలో 6 లక్షల 37వేల 838 ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 3,28,222 మంది ఉండగా మహిళా ఓటర్లు 3,09,568 మంది ఓటర్లు ఉన్నారు. సర్వీసు ఓటర్లు 156 మంది, హిజ్రాలు 48 మంది ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 580 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.