మియాపూర్ : ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని గుర్తించి అధికారులు ముందుకు సాగాలన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్ననాయక్, కార్పొరేటర్లు హమీద్ పటేల్ , రాగం నాగేందర్యాదవ్, జగదీశ్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్, మంజులరెడ్డి సహా ఆయా విభాగాల అధికారులతో విప్ గాంధీ శుక్రవారం మియాపూర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో నాలాల విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని, ఎస్టీపీలను అనుసంధానమైన కాలువల నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. చందానగర్లోని రెడ్ది కాలనీలో ఎస్టీపీ ఔట్ లెట్ నిర్మాణానికి అడ్డంకులను తొలగించాలని గాంధీ పేర్కొన్నారు. రహదారులపై నీరు నిలిచే ప్రాంతాల వద్ద తక్షణ మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
ఇంజినీరింగ్ జలమండలి విభాగాలు సమన్వయంతో పని చేయాలని, వర్షాల నేపథ్యంలో నాలాలు, మ్యాన్ హోళ్ల వద్ద కనీస రక్షణ చర్యలను చేపట్టాలని సూచించారు. చెరువుల సుందరీకరణ పనులలో వేగం పెంచాలని గాంధీ పేర్కొన్నారు. స్మశానాల అభివృద్ధి, స్మశానాల అభివృద్ధి పనులలో పురోగతి సరిగా లేదన్నారు. జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతిని నియోజకవర్గంలో విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వంశీమోహన్, ఆర్ఐలు శ్రీకాంత్, శ్రీనివాస్, ఎస్ఈ శంకర్నాయక్, ఈఈలు శ్రీనివాస్, శ్రీకాంతి, డీఈ సురేశ్, రమేశ్, స్రవంతి, జలమండలి జీఎం రాజశేఖర్ , డీజీఎంలు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.