దేశంలో వినియోగంలో 25 శాతం వృద్ధి
మూడో స్థానంలో హైదరాబాద్
2022 త్రైమాసిక నివేదికను విడుదల చేసిన నైట్ ఫ్రాంక్
సిటీబ్యూరో, ఏప్రిల్ 6 : దేశంలో ఆఫీస్ స్పేస్ వినియోగం 25 శాతం పెరిగిందని నైట్ ఫ్రాంక్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2022 మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఆఫీసుల కోసం లీజుకు తీసుకునే సామర్థ్యం పెరిగిందని, మొత్తం 8 నగరాల్లో కలిపి 25 శాతం పెరిగిందని పేర్కొన్నది. మూడు నెలల్లో మొత్తం 10.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడిన ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో బెంగళూరు నగరం 3.5, ఎన్సీఆర్ 2.3, హైదరాబాద్ నగరం 1.6, చెన్నై నగరం 1.0 మిలియన్ చదరపు అడుగులు ఆఫీసు స్థలాన్ని వివిధ సంస్థలకు లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్నది. కాగా మూడు నెలల్లో అద్దెల విలువల్లో ఎలాంటి మార్పు లేదని, అన్ని నగరాల్లో నిలకడగా ఉందని నివేదికలో తెలిపారు.
కేవలం బెంగళూరు నగరంలోనే ఒక ఏడాది కాలంలో 4 శాతం పెరిగింది. ఇక ఆఫీస్ స్పేస్కు డిమాండు ఉండడంతో పలు నగరాల్లో కొత్త ప్రాజెక్టులను పలు కంపెనీలు చేపట్టాయి. ఇందులో పుణె నగరంలో ఈ త్రైమాసికంలో 3.6 మిలియన్ చదరపు అడుగులు కొత్తగా అందుబాటులోకి వచ్చిందని, ఇది ఇతర నగరాల కంటే చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అదేవిధంగా కో వర్కింగ్ స్పేస్ వినియోగం బాగా పెరిగిందని, త్రైమాసికంలో అద్దెకు తీసుకున్న మొత్తంలో 21 శాతం కో వర్కింగ్ స్పేస్ కోసమే వినియోగిస్తున్నారని నైట్ఫ్రాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు.