సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో మంగళవారం ఎన్టీఆర్ పార్కు, లుంబినీ పార్కులను మూసివేస్తున్నామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నది. దీంతో సందర్శకులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సోమాజిగూడలోని రాజ్భవన్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు ప్రధాని రోడ్డ మార్గంలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా పార్కులను మూసి ఉంచాలని పోలీసు ఉన్నతాధికారుల సూచించారు.ఈ మేరకు హెచ్ఎండీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.