హైదరాబాద్ : ఫార్ములా ఈ రేస్కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సాగర తీరాన ట్రాక్ పనులు, గ్యాలరీ ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఫార్ములా ఈ రేస్ నిర్వహణ నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 21వ తేదీ నుంచి యథావిధిగా పార్కులు తెరుచుకోనున్నాయి.
16వ తేదీ నుంచే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఖైతరాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం రూట్, ట్యాంక్బండ్ పరిసరాలలో వెళ్లవద్దని ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. ఆ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని, అనసవసరంగా ఆ రూట్లలో వెళ్లి ట్రాఫిక్లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు.