Secunderabad | సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ను నార్త్ జోన్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై మీదుగా నేపాల్ పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్, జవహర్నగర్ కాలనీలోని ఓం, పీజీ టవర్స్ మొదటి అంతస్థులో రాహుల్ గోయల్ నివాసముంటారు. 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్కు వెళ్లారు. 10వ తేదీన తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి మెయిన్ డోర్ లాక్ పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. అల్మారా తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, వజ్రాలు, రూ. 49 లక్షల నగదు కనిపించలేదు. చోరీకి గురైన సొత్తు విలువ దాదాపు రూ.4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇంటికి కాపాలాగా ఉన్న కమల్, అతడి కుటుంబ సభ్యులు కనిపించడం లేదని, వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని బాధితుడు పోలీసులకు వెల్లడించాడు. నేపాల్కు చెందిన వారు కావడంతో పక్కా ప్లాన్తో దోపిడీకి పాల్పడే అవకాశం ఉన్నదని, ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలతో పాటు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన నార్త్ జోన్ పోలీసులు.. నిందితులను ముంబైలోని మధుర బస్స్టేషన్లో పట్టుకున్నారు. కమల్ భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన కమల్ మాత్రం తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.