సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ముగిసింది. ఈ నెల 20 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా, చివరి రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలు అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది కార్పొరేటర్లు, ఎంఐఎం పార్టీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులుగా దరఖాస్తులు చేసుకున్నారు. చివరి రోజు ఎంఐఎం నుంచి గౌసుద్దీన్ , మహ్మద్ ఖాదర్, మహ్మద్ ముజఫర్ హుస్సేన్, ఫర్హద్ బిన్ అబ్దుల్ సమీఅద్ బిన్, మహమూద్ నసీరుద్దీన్, షాహీన్ బేగం, రఫత్ సుల్తానా, కాంగ్రెస్ నుంచి వై. ప్రేమ్కుమార్, ఈఎస్ రాజ్ జితేంద్రనాథ్ నామినేషన్ వేశారు. దరఖాస్తులను అధికారులు బుధవారం పరిశీలించనున్నారు. మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ, ఆ తర్వాత అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. పోటీలో 15 మంది కన్నా ఎక్కువ మంది నిలిస్తే 7వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నిక పక్రియను నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.