ఏడుగురు నోడల్ అధికారుల నియామకం
180 మందితో 189 కాలనీల్లో పనులు
సైదాబాద్, మే 29 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించటానికి జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పక్షం రోజులపాటు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులతో కలిపి టీంలను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించటానికి నోడల్ అధికారులను నియమించారు. విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ, బయోడైవర్శిటీ అధికారులు, ఎంట్రామాలజీ, టౌన్ ప్లానింగ్ వంటి అనేక ప్రభుత్వ రంగ శాఖలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో పాల్గొంటారు.
మలక్పేట సర్కిల్ పరిధిలో..
మలక్పేట సర్కిల్ పరిధిలో ఏడు డివిజన్లలో నెలకొన్న సమస్యలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. డివిజన్ల వారీగా జరిగిన అభివృద్ధి పనుల్లో పురోగతి, సాధించాల్సిన అంశాల వారిగా ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్కిల్లో పరిధిలోని 7 వార్డులకు కలిపి 18 టీంలను ఏర్పాటు చేసి ప్రతి వార్డుకు ఒక నోడల్ ఆఫీసర్ను నియమించారు. ఒక టీంలో 18 మంది చొప్పున వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులను, సిబ్బందిని నియమించారు. 180 మంది సిబ్బందితో 189 కాలనీల్లో వ్యర్థాలను తొలగించటానికి ప్రత్యేకంగా 18 వాహనాలను కేటాయించి వాటి ద్వారా పనులను చేయనున్నారు.
అభివృద్ధి పనులు చేపడుతున్నాం..
అన్ని డివిజన్లలో ‘ పట్టణ ప్రగతి ’ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నోడల్ అధికారులు ప్రత్యేక టీంల పని విధానాన్ని పరిశీలిస్తారు. మొత్తం 180 మంది 189 కాలనీల్లో రోడ్లు, ఖాళీ ప్లాట్లలో ఉన్న చెత్త, వ్యర్థాలను తొలగించనున్నారు. హరిత హరం మొక్కల పరిశీలన చేస్తారు. సకాలంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తాం. బస్తీవాసులు అధికారులు, సిబ్బందికి సహకారం అందించాలి.
– ఎస్. జయంత్, డిప్యూటీ కమిషనర్, జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్