సిటీబ్యూరో, ఏప్రిల్ 28 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో రెండో రోజు పెట్రోల్, డీజిల్ దొరకక నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనం లేకపోతే నగరంలో ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఆఫీసులు, వ్యాపారాలు ఇలా అనేక రకాల పనుల కోసం నగరవాసులు అత్యధికంగా సొంత వాహనాలనే వినియోగిస్తారు. ప్రస్తుతం ఇంధన కొరత వెంటాడుతుండటంతో వాహనదారులు తమ గమ్యాలకు చేరుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా చాలా మంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. బంక్ల ముందర వాహనాలు కిలో మీటర్ల మేర క్యూలో ఉంటున్నాయి. ఫుల్ ట్యాంక్ చేసిన గానీ రెండు రోజులు కూడా సరిపోని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఎక్కడైన బంక్ తెరిచి ఉంటే చాలు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
దిల్షుక్నగర్, కోఠి, అబిడ్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో ఇంధన కోసం వాహనాలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. క్యూ లైన్లతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసులు బంక్ల వద్ద విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. రెండు, మూడు గంటల్లోనే బంక్లు నో స్టాక్ బోర్డులు పెట్టేస్తుండటం గమనార్హం. కృత్రిమ కొరత సృష్టించాలనే చాలా బంక్లు నో స్టాక్ బోర్డులతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయని వాహన సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి సరిపడాఇంధనం సమకూర్చేల చర్యలు తీసుకోవాలని కోరారు.