సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): నెలలు నిండుతున్న గర్భవతిని ఎన్నో రకాల ఆరోగ్య సంక్లిష్టతలు చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని అధిగమిస్తూ ప్రసవం కోసం ఒక్కో రోజు లెక్కపెట్టుకునే సమయంలో కరోనా వైరస్ ఓ అశనిపాతంలా వచ్చి దాపురిస్తే…అప్పుడు ఆమెతో పాటు ఆ ఇంటి కుటుంబసభ్యులు పడే వేదన వర్ణనాతీతం. పులి మీద పుట్రలా.. తరచూ వెళ్లే ప్రైవేటు క్లినిక్లు కూడా ఒక్కోసారి అలాంటి గర్భిణులకు వైద్యాన్ని నిరాకరిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో ఉన్న సర్కారు కొవిడ్ కేంద్రాలైన గాంధీ, సుల్తాన్ బజార్, పేట్లబుర్జు, కింగ్కోఠి, నిలోఫర్ దవాఖానలు రెండు వేవ్లలో దాదాపుగా 3800 మంది గర్భవతులకు సురక్షిత వైద్యాన్ని అందించాయి. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 1500 మందికి సురక్షిత ప్రసవాలు జరిగాయి. కాగా, ప్రస్తుతం కరోనా థర్డ్వేవ్లో కూడా గర్భవతులకు వైరస్ సోకుతుండడంతో గాంధీ దవాఖానలో ప్రత్యేక ప్రసూతి వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్డులో 35మంది చేరినట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు.
ఆ బిడ్డకు వైరస్ సోకదు
గడిచిన రెండు వేవ్లలో మాదిరిగా కాకుండా మూడోవేవ్లో గర్భవతుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. పాజిటివ్ సోకకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కరోనా సోకిన ప్రతి గర్భవతికి దవాఖానలో చేరాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రసవ సమయం సమీపిస్తున్నవారు, బీపీ, షుగర్, థైరాయిడ్, ప్లజంటా వంటి సమస్యలతో బాధపడుతున్నవారు, ఉమ్మనీరు తక్కువగా ఉన్నవారు మాత్రం కరోనాకు గురైతే కచ్చితంగా దవాఖానలో చేరాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైరస్ సోకిన గర్భవతులకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని ప్రసవాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రసవం జరిగిన వెంటనే బిడ్డను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)కు తరలించి 5 రోజుల పాటు బిడ్డకు తల్లిపాలతో ఫీడింగ్ ఇస్తారని చెప్పారు. ఈ మధ్య కాలంలో తల్లిలో వైరస్ నశించడం వల్ల బిడ్డకు ఎలాంటి హాని ఉండబోదని డాక్టర్ రాజారావు తెలిపారు. తల్లిపాలివ్వడం వల్ల శిశువుకు వైరస్ సోకదని చెప్పారు.
సుల్తాన్ బజార్ దవాఖానలో.. క్లిష్టమైనా.. సురక్షితంగా కాన్పులు
సుల్తాన్బజార్, జనవరి 21. కోవిడ్ సోకిన గర్భవతులకు సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో వైద్యులు చక్కటి వైద్యం అందిస్తూ సురక్షితంగా ప్రసవం చేస్తున్నారు. కరోనా మూడో దశలో ఇటీవల వైరస్ బారిన పడిన ఏడుగురు గర్భవతులు దవాఖానలో చేరారు. సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వీరందరికీ వైద్యులు సురక్షితంగా సిజేరియన్ కాన్పులు చేశారు. ప్రస్తుతం వీరందరూ క్షేమంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుల్తాన్ బజార్ ప్రభుత్వ దవాఖాన లో 25 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
జాగ్రత్తలే శ్రీరామ రక్ష
ఒమిక్రాన్తో పాటు ఇప్పుడు డెల్టా వైరస్ కూడా విజృంభిస్తున్నది. పాత వేరియంటే కంటే కొత్త డెల్టా వేగంగా వ్యాపిస్తున్నది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడని వారితో పాటు టీకా తీసుకున్నవారు, గత 2 వేవ్లలో పాజిటివ్ వచ్చిన వారు కూడా దీని బారిన పడుతున్నారు. బూస్టర్ తీసుకున్నా సరే జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ వదలదు. గర్భవతులు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉండే ఇంట్లో వైరస్ చొరబడకుండా కుటుంబ సభ్యులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకండి. నలుగురు ఉండే చోట మీరు ఉండకండి. ఫంక్షన్లు, ప్రయాణాలు వాయిదా వేసుకోండి. లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోండి. సాధారణంగా గర్భవతులు బయటకు వెళ్లరు. కాని ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు వివిధ పనులమీద బయటకు వెళ్లినప్పుడు వారు కరోనా వైరస్కు గురయ్యే అవకాశాలు అధికం. ఈ క్రమంలో వైరస్బారిన పడిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చినప్పుడు వారి ద్వారా గర్భవతులకూ వైరస్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి.
తల్లి నుంచి బిడ్డకు పాజిటివ్ రాదు..
పాజిటివ్ సోకిన గర్భవతి నుంచి పుట్టబోయే బిడ్డకు కరోనా సోకదని గాంధీ దవాఖాన ప్రసూతి విభాగం వైద్యురాలు డాక్టర్ మహలక్ష్మి తెలిపారు. బిడ్డ జన్మించిన తరువాత సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకే అవకాశముంటుందన్నారు. ప్రసవ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కూడా బిడ్డకు పాజిటివ్ సోకే అవకాశం 1శాతం ఉంటుందని ఆమె హెచ్చరించారు.