సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లాలో నియమించిన ఆయా నోడల్ అధికారులు తమ తమ విధులను పూర్తి అవగాహనతో బాధ్యతగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో మీడియా సర్టిఫికెషన్ అండ్ మానిటరింగ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్స్పెండేచర్ మానిటరింగ్, స్వీప్, మ్యాన్ పవర్, మెటీరియల్ మేనేజ్మెంట్, పీడబ్ల్యూడీ, తదితర నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులతో ఆయా నోడల్ అధికారుల పనితీరుపై కూలంకషంగా చర్చించారు. ఆయా కమిటీల నోడల్ అధికారులకు సంబంధిత విషయాలలో పలు సూచనలు చేశారు. అదేవిధంగా సి-విజిల్, ఎస్ఎంఎస్ మానిటరింగ్ సెల్, ఎన్జీఎస్ పోర్టల్, ఎన్ కోర్ యాప్, క్యూ మేనేజ్మెంట్, ఓటరు టర్న్ ఔట్, తదితర ఏర్పాట్లపై రొనాల్డ్ రాస్ చర్చించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ జాగ్రత్తగా చేయించాలని, ఫారం-2 ఆమోదం పొందిన ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేలా ఆయా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారికి సూచించారు.
‘సి’ విజిల్లో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నిర్ణీత సమయంలో పరిషరించాలన్నారు. ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణకు సిద్ధం చేసుకోవాలని సంబంధిత నోడల్ అధికారికి సూచించారు. ఎన్నికల విధుల నుండి ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆయా నోడల్ అధికారులు అప్రమత్తతతో జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతయారు, చంద్రకాంత్ రెడ్డి, ఆయా నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్బజార్, ఏప్రిల్18: నగరంలో ప్రా ముఖ్యత గల వారసత్వ సంపదను కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. గురువారం అంతర్జాతీయ హెరిటేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దారుల్షిఫా నుంచి ఉస్మానియా దవాఖాన చింత చెట్టు వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్లో ఆయన జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీలు, చారిత్రక ప్రియులతో కలిసి పాల్గొన్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల విధులకు నియమించబడిన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారిపై జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ చర్యలు తీసుకున్నారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన సిబ్బందిపై ఆర్పీ యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి సహకార, రిజిస్టార్ కార్యాలయానికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ ఇలియాస్ అహమ్మద్, ఓయూ సీనియర్ అసిస్టెంట్ జి.రవిప్రసాద్, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె.కృష్ణయ్య, డీఈఓ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ మజీద్ ఖాన్, ఖాజీపురా ప్రభుత్వ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ మీర్జా నసీర్ బేగ్, పంజాగుట్ట డివిజన్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డీఎస్టీఓ కె.నాగరాజు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంజాగుట్ట డివిజన్ జూనియర్ అసిస్టెంట్ కె.మధుసూదన్ కుమార్, టీచర్ సయ్యద్ అబ్దుల్లా జుబేర్, హజ్ కమిటీ జూనియర్ అసిస్టెంట్ కె.మహేశ్, ఆర్అండ్బీ శాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్ చిలివేరు శంతన్కుమార్లపై చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారికి ఈ నెల 20వ తేదీన మళ్లీ శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని, అప్పటికీ గైర్హాజరైన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.