సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను ప్రభుత్వ సెలవు రోజులు, భారీ వర్షాల పేరుతో వారం వారం రద్దు చేస్తున్నారు. దీంతో నగర ప్రయాణికలు అతి చౌకైన ప్రయాణానికి దూరమవుతున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగర ప్రయాణికులకు అందుబాటులో ఉండే అతి చౌకైన మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ సర్వీసులను భారీగా తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి శనివారం, ఆదివారాలతో పాటు ప్రభుత్వ ప్రకటించే సెలవు రోజులలో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నారన్న కారణంతో 34 ఎంఎంటీస్ సర్వీసులు రద్దు చేస్తున్నారు.
మరో పక్క ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో రైలు సర్వీసులు సెలవులు రోజులైనప్పటికీ నడుపుతున్నారు. నగరంలో ప్రధాన మార్గాలలో సిటీ బస్సులు ప్రయాణికులకు అందుబాటు ఉంటున్నాయి. అదేవిధంగా నాగోల్ నుంచి మాదాపూర్, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు ఉన్న మెట్రో రైళ్లు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా జంట నగర వాసులు సెలవు రోజులలో వ్యాపారస్తులు, దినసరి కూలీలు, కార్మికులు, చిరు ఉద్యోగులు, ఇతర అవసరాల కోసం ఫలక్నుమా- సికింద్రాబాద్, ఫలక్నుమా-లింగంపల్లి వంటి మార్గాలలో ప్రయాణికులు నిత్యం రద్దీగా ఉంటారు. దాదాపు ప్రతి రోజూ మూడు లక్షల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. సర్వీసులు పెంచితే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందంటున్నారు.
రెగ్యులర్గా నడిచేవి 80 సర్వీసులే..
కరోనా వైరస్ వ్యాప్తికి ముందు దాదాపు 120 వరకు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నడిపేవారు. లాక్డౌన్ సడలింపు పేరుతో 120 బదులుగా 80లోపే లోకల్ రైలు సర్వీసులను నడుపుతున్నారు. అందులో కూడా శని, ఆదివారాలు, సెలవులు, వర్షాలు వంటి రకరకాల కారణాలతో రెగ్యులర్గా 34 సర్వీసులు రద్దు చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ఎంఎంటీఎస్ రైళ్లో ప్రయాణం చేసే వారికి, పాసులు తీసుకున్న వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రైల్వే అధికారుల స్పందించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.