సికింద్రాబాద్, జనవరి 21: సర్కిల్ పరిధితో పాటు తన డివిజన్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడం లేదని సర్కిల్-29 డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డిపై జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి మండిపడ్డారు. ప్రోటోకాల్ను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సర్కిల్లోని తార్నాక డివిజన్ లాలాపేట్ ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పనులను రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పరిశీలించారు. తన డివిజన్లో డిప్యూటీ స్పీకర్ పర్యటన ఉన్నా ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ సమాచారం ఇవ్వకలేదు. తార్నాకలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతున్న అధికారిక కార్యక్రమానికి కూడా తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు తన డివిజన్లో అధికారిక కార్యక్రమాలు జరిగినప్పటికీ సమాచారం ఇవ్వలేదన్నారు. ఒంటెద్దు పోకడలతో అభివృద్ధి పనులకు సైతం మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. డీసీ స్థాయిలో ఉండి కూడా రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న తీరు విడ్డూరంగా ఉందన్నారు. తన సొంత డివిజన్లో తనకు సమాచారం లేకుండా అభివృద్ధి పనులు ప్రారంభించడంపై అసహనం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా డీసీ తన వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి సంబంధించి సర్కిల్ పరిధిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్కు డీసీ మోహన్రెడ్డిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.