ఇంధన ధరల పెంపుతో ప్రయాణికులకు తప్పని ఉక్కపోత
15 శాతం చార్జీల పెంపునకు అనుమతించిన ఉబర్ ఇండియా
ఈ పెంపుతో ఏసీ వేయలేమని కరాఖండిగా చెబుతున్న డ్రైవర్లు
తాజా పెంపుతో 14 రోజుల్లో పన్నెండోసారి పెరిగిన ఇంధన ధరలు
తగ్గేదేలే అంటున్న ఇంధన ధరలు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పెరిగిపోతున్న చమురు రేట్లతో బెంబేలెత్తిన క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలకు ‘నో ఏసీ’ బోర్డులు పెట్టేశారు. నిబంధనలు వర్తిస్తాయంటూ.. ఉబర్ ఇండియా కొంత చార్జీల పెంపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినా.. అది తమకు గిట్టుబాటు కాదంటూ.. వారు ఏసీలకు ససేమిరా అంటున్నారు. మరోవైపు పద్నాలుగు రోజుల్లో పన్నెండుసార్లు పైకి ఎగబాకిన పెట్రో ధరలు ఆకాశమే హద్దుగా.. దూసుకుపోతున్నాయి. తాజాగా పెట్రోలుపై రూ.9.48.. డీజిల్పై రూ. 7.82 పెంచడంతో సామాన్యులు కేంద్రం తీరుపై భగ్గుమంటున్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కళ్లెంలేని గుర్రంలా పరుగులు పెడుతున్న ఇంధన ధరల ప్రభావం అన్ని రంగాలపైనా తీవ్రంగా చూపుతున్నది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా నగరంలోని వివిధ కంపెనీల క్యాబ్ల్లో డ్రైవర్లు ఏసీ బటన్ను ఆఫ్ చేసి పెడుతున్నారు. క్యాబ్ చార్జీలు గిట్టుబాటు కాకపోవడం, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ‘నో ఏసీ’ అంటూ క్యాబ్ల్లోనే పోస్టర్లు అంటించారు. ముఖ్యంగా గత పద్నాలుగు రోజుల్లో ఏకంగా పన్నెండు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ క్రమంలో పదిహేను రోజుల కిందటితో పోలిస్తే… హైదరాబాద్లో పెట్రోలు ధర లీటరుకు రూ.9.48 పెరిగి రూ.117.23 చేరింది. అదేవిధంగా, డీజిల్ ధర లీటరుకు రూ.7.82 పెరిగి రూ.103.32 చేరింది. ఈ ట్రెండ్ చూస్తే… ఈ పెంపు ఆగే పరిస్థితి లేదని సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. దీంతో గత కొన్ని రోజులుగా క్యాబ్ డ్రైవర్లు తమకు గిట్టుబాటు కావడంలేదంటూ ఏసీ వేయడం మానేశారు. దీనిపై సామాన్యులు ఆయా కంపెనీలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కంపెనీలు కొంతమంది డ్రైవర్ల ఐడీలను బ్లాక్ చేశాయి. ఇంధన ధరలు పెరగడంతో చార్జీలు పెంచి డ్రైవర్లకు న్యాయం చేయాలని కొంతమంది ప్రయాణికులు సూచిస్తున్నారు. దీంతో తాజాగా ఉబర్ ఇండియా మాత్రం 15 శాతం పెంపునకు అనుమతిచ్చింది.
పెంపునకూ నిబంధనలు…
ప్రస్తుత చార్జీలపై 15 శాతం పెంపుదల చేసినట్లు ఉబర్ ఇండియా తమ డ్రైవర్లకు సమాచారాన్ని పంపింది. ఇందులో భాగంగా నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎంత చార్జీలు ఉన్నాయి.? ఇప్పుడు ఎంత పెంచారు.? అనేది జాబితాను కూడా పంపింది. అయితే, ఈ పెంపుదల నిరవధికంగా కాకుండా కొన్ని షరతులు విధించింది. శని, ఆది, సోమవారాల్లో మాత్రమే ఈ పెంపుదల అమలవుతుందని, మిగిలిన రోజుల్లో సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటలు అంటే మూడు గంటల పాటు బుక్ అయ్యే రైడ్లకు మాత్రమే ఈ పెంపుదల వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. చార్జీలు పెంచినందున ఇక రైడ్ల సమయంలో ఏసీ వేయాలని ఆదేశించింది. కానీ, నగరంలోని ఉబర్ డ్రైవర్లు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. పదిహేను శాతం పెంపుదల కూడా తమకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. ఓలా ఇతర కంపెనీల క్యాబ్ డ్రైవర్లు కూడా ఇప్పటికే ఆయా కంపెనీల ముందు పెంపుదల ప్రతిపాదన ఉంచగా… ఆ కంపెనీలు అధికారికంగా మాత్రం ప్రకటనలు చేయలేదు. క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఇలా ఉంటే… ఇంధన ధరల పెంపు సగటు ప్రయాణికుడిపై మాత్రం తీవ్ర భారాన్ని మోపుతుందనేది సుస్పష్టం.