Nizampet | దుండిగల్, ఏప్రిల్ 6: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలు, అనుమతులు లేని నిర్మాణాలు దర్శనమిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇందుకు పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లాన్) విభాగంలో నెలకొన్న అనిచ్చితే కారణమని అంటున్నారు.
నిజాంపేటలో పనిచేసే అసిస్టెంట్ సిటీ బ్యానర్, సెక్షన్ అధికారులు రెగ్యులర్ ఉద్యోగులు కాకపోవడం, వారంలో ఏసీపీ మూడు రోజులు, టీపీఎస్ తర్వాతే మూడు రోజులు విధులకు హాజరవ్వడం అక్రమార్కులకు, వారితో కుమ్మక్కైన కింది స్థాయి సిబ్బందికి కలిసి వస్తుందని విమర్శలు చెలరేగుతున్నాయి. ఒకవేళ సంబంధిత శాఖ అధికారులు విధులకు హాజరైన తమ పనుల్లో నిమగ్నం అవుతారే తప్ప ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టరని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతసేపు తమకు ఏమి మిగులుతుంది.. అనే ధ్యాసే తప్ప అక్రమ నిర్మాణాలతో భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులపై ఎంత మాత్రం ఆలోచన చేయడం లేదని పలువురు వాపోతున్నారు. ఫలితంగా ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు లేని, అక్రమ కట్టడాలు నిజాంపేట కార్పొరేషన్లో యథేచ్ఛగా జరుగుతున్నాయని, దీంతో కార్పొరేషన్కు, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని అంటున్నారు.
జీ ప్లస్ టు అంతస్తులకు అనుమతులు.. ఐదంతస్తుల నిర్మాణం
నిజాంపేట కార్పొరేషన్, బాచుపల్లి పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఓ వ్యక్తి సుమారు 200 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జీ ప్లస్ టు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఏకంగా ఐదంతస్తులు నిర్మించాడు. అంతటితో ఆగకుండా పెంట్ హౌస్ సైతం నిర్మిస్తున్నాడని స్థానికులు పేర్కొంటున్నారు. పైగా రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో పాటు కమర్షియల్ షటిల్ వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాడని స్థానికులు వాపోతున్నారు. అధికారులను మేనేజ్ చేశాం.. మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు…? అంటూ నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నాడని వాపోతున్నారు.
అసైన్డ్ భూమిలో ఆరంతస్తులు
నిజాంపేటలోని సైదప్ప కాలనీ సమీపంలో ఉన్న సర్వేనెంబర్ 191 ప్రభుత్వ భూమిలో ఓ వ్యక్తి ఏకంగా సుమారు 250 గజాల స్థలంలో అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. అయితే ఈ భవనానికి సంబంధించి గతంలోనే జీవో 59 ప్రకారం ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయించుకుని, జీ ప్లస్ టు అంతస్తుల కోసం రెండు ఫ్లాట్లకు వేరువేరుగా అనుమతులు తీసుకొని తదనంతరం రెండింటిని క్లబ్ చేసి ఒకే భవనంగా నిర్మిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక సీపీఎం నేత పలుమార్లు టౌన్ ప్లానింగ్లోనూ, కలెక్టరేట్లోనూ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అవినీతి దాగి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని పలువురు పేర్కొంటున్నారు.
మీరు కట్టుకోండి… మేం తర్వాత అనుమతులు ఇస్తాం…!
నిజాంపేట కార్పొరేషన్ పరిధి30 వ డివిజన్లోని సిరి వ్యాలీ గేటెడ్ కమ్యూనిటీని ఆనుకుని సుమారు అర ఎకరం స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండానే ఓ వ్యక్తి స్విమ్మింగ్పూల్ నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. పేద ప్రజలు చిన్న గూడు నిర్మించుకుంటేనే అనుమతుల పేరుతో కూల్చివేస్తూ నానా హంగామా చేసే అధికారులు, కళ్ల ముందరే గత రెండు నెలలుగా భారీ షెడ్డును నిర్మించడంతోపాటు, ఈత కొలను కోసం భారీగా మట్టి తవ్వి కొలను నిర్మించినప్పటికీ అధికారులు అటువైపు చూడకపోవడం ఏంటని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై స్విమ్మింగ్ పూల్ నిర్మాణదారుడు తాము మునిసిపల్ అధికారులను మేనేజ్ చేశామని బాహాటంగానే చెప్పుకోవడంతోపాటు ముందు మీరు కట్టుకోండి. తర్వాత మేమే ట్రేడ్ లైసెన్స్ వంటి అనుమతులు ఇస్తాం అంటూ భరోసా కల్పించారని పేర్కొనడానికి బట్టి చూస్తుంటే అధికారులే అక్రమ నిర్మాణాల వెనుక ఉండి నడిపిస్తున్నారనేది తేటతెల్లమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణాలను నిలువరించాల్సిన వారే ప్రోత్సహిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండిపడక మరేం జరుగుతుందని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. నిజాంపేట మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై సిడిఎంఏ అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే పలువురు కిందిస్థాయి సిబ్బంది చేతివాటం కారణంగానే కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు, అనుమతి లేని నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.