తెలంగాణ రాష్ట్ర సమితి 20ఏండ్ల పయనాన్ని వెనక్కి తిరిగి చూస్తే.. అనేక జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. అందులో ప్రధానంగా గన్పార్కు, బషీర్బాగ్, నిజాంకళాళాల మైదానం, ఎల్బీస్టేడియం కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో ఉద్యమ సమయంలో నిర్వహించిన సభలు, సమావేశాలు, నిరసనలు, వంటావార్పు ఇలా అనేకం మదిలో మెదులుతాయి. సమైఖ్య పాలనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిసారి గన్పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అసెంబ్లీ సమావేశంలో అడుగుపెట్టేవారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుతూ రాజీనామా చేసినా.., ప్రజల్లోకి వెళ్లి తిరిగి గెలిచి వచ్చినా.. మొదటగా గన్పార్కు వద్దకే వచ్చేవారు. ఇలా ఈ ప్రాంతాలు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమైనవిగా నిలిచాయి. నిజాంకళాశాల, ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలు, సమావేశాలు తెలంగాణ రాష్ట్ర సమితికి హైలెట్ అని చెప్పవచ్చు.
అబిడ్స్, ఏప్రిల్ 26 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో భాగంగా నిజాం కళాశాల మైదానంలో జరిగిన సభలు, సమావేశాలు కీలకమయ్యాయి. నిజాం కళాశాల మైదానంలో పలు మార్లు సభలు నిర్వహించడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 సంవత్సరంలో ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పలు పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా అభినందన సభ, అంతకు ముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశాలు, ఇలా అనేక సభలు, సమావేశాలను నిజాం కళాశాల, ఎల్బీ స్టేడియం మైదానాలలో నిర్వహించే వారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టిన ఉద్యమ కార్యకలాపాలు నిజాం కళాశాల నుంచే చేపట్టేవారు. నిజాం కళాశాలతో పాటు బషీర్బాగ్ ప్రాంతాలు కేంద్ర బిందువులుగా నిలిచాయి. 2001 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచనా విధానంతో, ఉద్యమ విధి విధానాలతో అనేక కార్యక్రమాలను చేపట్టారు. వంటా వార్పు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి వంటి అనేక ఉద్యమ కార్యక్రమాలు బషీర్బాగ్లో చేపట్టే వారు. అంతేకాకుండా నాటి పాలకులు ఉద్యమ సభలకు అనుమతి ఇవ్వక పోవడంతో నిరసన తెలుపుతూ దిష్టి బొమ్మల దహనాన్ని బషీర్బాగ్ ప్రాంతంలోనే నిర్వహించే వారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను చేపడుతూ దేశంలోనే నంబర్ వన్ సీఎంగా నిలిచారు.
2001 సంవత్సరంలో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, ఉద్యోగాల సాధన జరుగుతుందని తెలంగాణ ప్రజలకు వివరించి ప్రజల మద్దతుతో మలిదశ ఉద్యమం కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు పాటు పడుతున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాటు పడుతున్నారు. నాటి ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సమస్య ఏర్పడుతుంది, శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని చేసిన అసత్య ప్రచారాలను తిప్పి కొట్టి కోతలు లేని విద్యుత్ సరఫరా చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడుతూ వస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.