Hyderabad | నాన్న దగ్గరికి వెళ్లాలన్న తొందర ఓ చిన్నారిని చిదిమేసింది. బుడిబుడి అడుగులతో పరుగులు తీస్తున్న ఓ పాపపైకి స్కూల్ బస్సు మృత్యువులా దూసుకొచ్చింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా స్కూల్ చక్రాల కింద నలిగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ హబ్సిగూడలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన మిథున్ గత ఆరేళ్లుగా కుటుంబంతో సహా హబ్సిగూడలో నివసిస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు స్థానిక జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం కుమారుడిని బస్సు ఎక్కించేందుకు రోడ్డుపైకి వచ్చాడు. వారం రోజుల పాటు స్వగ్రామానికి వెళ్తున్నామని.. తన కొడుకు కోసం రావాల్సిన అవసరం లేదని డ్రైవర్కు చెప్పాడు. డ్రైవర్తో మాట్లాడుతున్న సమయంలో కేర్టేకర్ దగ్గర ఉన్న కూతురు జవ్లానా (19 నెలలు ).. నాన్న దగ్గరికి వెళ్తానంటూ అకస్మాత్తుగా రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వచ్చింది. అదే సమయంలో బస్సు ముందుకొచ్చిన పాపను గమనించని డ్రైవర్ మహమ్మద్ ఇంతియాజ్ (40 ) బస్సును ముందుకుపోనిచ్చాడు. దీంతో బస్సు ముందు భాగం తగిలి చిన్నారి కిందపడిపోయింది. ఆ వెంటనే వెనుక టైర్ ఆ చిన్నారిపై నుంచి వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.