Hyderabad | మన్సూరాబాద్, ఫిబ్రవరి 15: ఆస్తులకు సంబంధించిన పత్రాలను తాకట్టు పెడితే.. పెద్ద మొత్తంలో అప్పులిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కేసులో 9 మందిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1,23,45,500 స్వాధీనం చేసుకున్నారు.
ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. మన్సూరాబాద్, సాయి సప్తగిరికాలనీకి చెందిన శంకరమ్మ (46) వడ్డీ వ్యాపారి. పత్రాలను తాకట్టుగా పెట్టుకొని అప్పులు ఇస్తుంది. డబ్బులు సరిగా చెల్లిస్తే.. అధిక మొత్తంలో కూడా అప్పులిస్తానంటూ నమ్మిస్తుంది. మెదక్కు చెందిన కండెల శ్రీనివాస్ (30) ఆమెకు సహకరిస్తూ.. అప్పులకు మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా.. ఓల్డ్ బోయినపల్లికి చెందిన నీలేశ్ కృష్ణారావు (38) ప్రైవేటు ఉద్యోగి. అతడికి పూణెలో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే వైభవ్, ఉత్తమ్చందన్ స్నేహితులు. వీరిద్దరూ కలిసి వ్యాపారం నిమిత్తం డబ్బుల కోసం కృష్ణారావును సంప్రదించారు. మన్సూరాబాద్, ఎరుకల నాంచారమ్మ కాలనీలో నివాసముండే కొందరు రుణాలు ఇస్తుంటారని ఇతరుల ద్వారా కృష్ణారావు తెలుసుకుని, విషయాన్ని వైభవ్, ఉత్తమ్చందన్కు తెలియజేశాడు. కండెల శ్రీనివాస్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డబ్బులు ఇప్పిస్తాడని కూడా తెలుసుకున్నారు. అతడిని కృష్ణారావు, వైభవ్, ఉత్తమ్చందన్ సంప్రదించారు. అప్పు విషయమై మాట్లాడేందుకు మన్సూరాబాద్కు రావాలని కండెల శ్రీనివాస్ సూచించడంతో ముగ్గురు కలిసి మంగళవారం అక్కడికి చేరుకున్నారు.
నాంచారమ్మ కాలనీలోని ఓ ఇంట్లో సమావేశమై.. రెండు నుంచి మూడు కోట్ల వరకు అప్పు ఇవ్వగలమని తెలిపారు. సరైన పత్రాలు సమర్పిస్తే మొదట రూ. 20 లక్షలు అప్పుగా ఇస్తామని.. రెండు నెలల తర్వాత తీసుకున్న రూ.20 లక్షలకు గాను వడ్డీతో కలిసి రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. నమ్మకం కుదిరితే కోటి వరకు అప్పుగా ఇస్తామని షరతులను వివరించారు. సంప్రదింపుల అనంతరం నీలేశ్ కృష్ణారావు, వైభవ్, ఉత్తమ్చందన్ను కండెల శ్రీనివాస్ తన వెంట సాయి సప్తగిరికాలనీలో నివాసముండే వడ్డీ వ్యాపారి శంకరమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. మూడు బాక్సుల్లో పెట్టిన రూ. 500 నోట్ల కట్టలను చూపించారు. డబ్బులను నీలేశ్ కృష్ణారావు, వైభవ్, ఉత్తమ్ చందన్ పరీక్షించారు. రూ.500 నోట్ల కట్టల్లో పైనా, కింద నోట్లు పెట్టి మధ్యలో థర్మకోల్ పెట్టినట్లు గ్రహించారు. అనుమానం రావడంతో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు ఇంటిపై దాడిచేసి నకిలీ నోట్ల కట్టలు ఉన్న బాక్సులతోపాటు అసలైన రూ.కోటి 23 లక్షల 45 వేల ఐదు వందల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసుతో సంబంధం ఉన్న కండెల శ్రీనివాస్, శంకరమ్మ, శ్రీనివాస్ సోదరుడైన కండెల రమేశ్, రవికుమార్, సుంకమ్మ, నాగయ్య, మెదక్కు చెందిన రాములు, సౌత్ ఎండ్ పార్కు కాలనీకి చెందిన దుర్గవ్వ, నిజామాబాద్కు చెందిన బోజన్నను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.