మారేడ్పల్లి, డిసెంబర్ 12 : క్రైస్తవులు క్రమ శిక్షణకు మారు పేరుగా నిలువడంతో పాటు వారిలో సేవా భావం ఎక్కువగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో 42వ యునైటెడ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే క్రిస్మస్ ఉత్సవాలను నిర్వస్తున్నది. క్రైస్తవులకు కిస్మస్ సందర్భంగా గిప్టులు, విందును ఏర్పాటు చేయడం ప్రభుత్వానికే చెల్లిందని మంత్రి తెలిపారు.
అలాగే ఆధ్మాత్మిక చింతన, అంకితభావంతో ఉండటం, ఇతరుల పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించడంలో క్రైస్తవులు ముందుంటారన్నారు. క్రైస్తవులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడు అండగా ఉంటాని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ బృందం ఆలపించిన పాటలు, మ్యూజిక్ అందరిని అలరించింది.
క్రిస్మస్ క్యారెల్స్, యేసు క్రీస్తు జనన విధానం పై ప్రదర్శించిన నాటికలు అందరిని కట్టిపడేశాయి. అనంతరం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఐజీ ఆకుల నరసింహా, ఉత్సవ కమిటీ చైర్మన్ సువర్ణరావు, వైస్ చైర్మన్ ప్రశాంత్, సెక్రటరీ జనరల్ కరుణాకర్, సంయుక్త కార్యదర్శి రావులపాటి మోజన్, ప్రతినిధులు అనిల్రెడ్డి, మన్మోహన్ ఖన్నా, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.