Hyderabad | విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారుల సోదాలు ముగిశాయి. హిమాయత్నగర్లోని వేణుగోపాల్ నివాసంతో పాటు ఎల్బీనగర్ సాయినగర్లోని రవిశర్మ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 4 గంటలకే తనిఖీ మొదలుపెట్టారు. దాదాపు 5 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి.
ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ అరెస్టయ్యాడు. అతని దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణుగోపాల్ నివాసంలో ఇవాళ సోదాలు జరిపారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ సెల్ఫోన్ను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలకు సంబంధించిన వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కాగా, తాను ప్రస్తుతం విరసంలో లేనని వేణుగోపాల్ వెల్లడించారు.
ఇక రవిశర్మ మొబైల్ఫోన్తో పాటు 1990కి ముందు దిగిన కొన్ని ఫొటోలు, కరపత్రాలు, పలు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. దీపక్ రావు అరెస్టు చేసిన కేసులో తమ పేర్లు ఉన్నాయనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారణ జరిపారని రవిశర్మ తెలిపారు. 2016లో జనజీవన స్రవంతిలో కలిసినప్పటి నుంచి తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని పేర్కొన్నారు. 2019, 2021లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తే ఎలాంటి ఆధారాలు లభ్యమవ్వలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 10వ తేదీన విచారణ నిమిత్తం ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారని పేర్కొన్నారు.