గోల్నాక, డిసెంబర్ 25: పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, అమ్మా ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అంబర్పేట గాంధీ హైస్కూల్లో మూడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ మధుకర్ స్వామి హాజరయ్యారు. పోలీస్ నియామకాల్లో అమ్మా ఫౌండేషన్ అధ్యక్షుడు పరశురాం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన సుమారు 250 మంది ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. అమ్మా ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థుల్లో ఇప్పటి వరకు 96 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ఒక్కో అభ్యర్థికి రూ.4వేల విలువగల 15 పుస్తకాలను పరవస్తు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గ్రీన్ల్యాండ్స్ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీకుమారి, గౌరవ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, ప్రాంతీయ చైర్మన్ విద్యాభూషణ్, యోగ గురువు సురేందర్, ప్రతినిధులు రాము, శ్రీను, స్వర్ణ్సింగ్, యాదగిరి, రషీద్ తదితరులు పాల్గొన్నారు.