హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్ : హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో న్యూ ఇయర్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సోమవారం నిర్వహించింది. ఈ వేడుకలకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రయాణికులు, సిబ్బందితో కలిసి ఆయన కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎంజీబీఎస్లోకి వెళ్లి ప్రయాణికులతో ముచ్చటించారు. బెంగళూరు, కోదాడకు వెళ్తున్న బస్సుల్లో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడారు.
ప్రయాణికులకు గులాబీలు అందించి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ కొత్త ఏడాదిలో సంస్థకు మంచి ఫలితాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం విజయవంతంగా అమలవుతున్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నదని ఎండీ అన్నారు.
ఇప్పటివరకు దాదాపు 6.60 కోట్లకు పైగా మహిళలను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఈ సీం ప్రకటించిన 48 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశామని, సిబ్బంది సహకారం వల్లనే ఇది సాధ్యమైందని కొనియాడారు. టీఎస్ఆర్టీసీకి ప్రయాణికులు, సిబ్బంది రెండు కండ్లలాంటి వారని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు.
ప్రయాణికులకు సన్మానం..
నూతన సంవత్సరం సందర్భంగా ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. సంస్థను ఆదరిస్తున్న ప్రయాణికులను ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించారు. స్వాతి, నారాయణ, మల్లేశ్, గోపాల్ రెడ్డి, షాబుద్దీన్లను శాలువాలతో సతరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డా.రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, సీఎంఈ రఘునాథ రావు, సీఈఐటీ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, తదితర ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.