సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): లోపభూయిష్ట ద్విచక్రవాహనంతో వినియోగదారుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, నూతన బైక్ (హోండా షైన్)ను 45 రోజుల్లోపు సమకూర్చాలని హైదరాబాద్ కన్జ్యూమర్ కమిషన్ -1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్నలతో కూడిన బెంచ్ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆడి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్లను ఆదేశించింది. దిల్సుఖ్నగర్కు చెందిన సీహెచ్ రవీంద్రబాబు రూ.85వేలు చెల్లించి హోండా సీబీ షైన్ బైక్ను 2017లో కొనుగోలు చేశాడు. అయితే షాక్ అబ్జోవర్స్లో లోపం తలెత్తింది. మొదటి సర్వీసింగ్ అయినా.. సమస్యను పరిష్కరించలేకపోయారు. వినియోగదారుడు న్యాయం కోసం కన్జ్యూమర్ కమిషన్ను ఆశ్రయించి.. సదరు సంస్థల నుంచి నష్టపరిహారాన్ని కోరారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కమిషన్.. వినియోగదారుడికి 45 రోజుల్లో కొత్త వాహనం అందజేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించింది.
నష్టపరిహారంతో పాటు ఖర్చులూ చెల్లించాల్సిందే
హైదరాబాద్ నుంచి గౌహతి వెళ్లేందుకు ముషీరాబాద్కు చెందిన కిశోర్కుమార్, మహేంద్రహిల్స్కు చెందిన నరసింహమూర్తి 2019లో రూ. 13,386 చెల్లించి.. విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఫ్లైట్ రద్దు అయినట్లు స్పైస్జెట్ నుంచి ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, స్పైస్జెట్ ఎయిర్లైన్స్, ఫ్లైట్ రాజా ట్రావెల్స్ లిమిటెడ్ రెండూ స్పందించలేదు. బాధితులు కన్జ్యూమర్ కమిషన్-1ను ఆశ్రయించగా, రూ.13,386లను బాధితులకు తిరిగి చెల్లించాలని, కేసు వివరాలను పరిశీలించిన కన్జ్యూమర్ కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. నష్టపరిహారంతోపాటు ఖర్చుల కింద రూ.10వేలు బాధితులకు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ కన్జ్యూమర్ కమిషన్-1 మధ్యవర్తిత్వ కమిటీని కమిషన్ అధ్యక్షురాలు బి. ఉమావెంకట సుబ్బలక్ష్మి ప్రకటించారు. వినియోగదారుల కేసుల్లో మధ్యవర్తిత్వం కోసం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదికలో 26 మంది సభ్యులుగా ఉంటారని, వీరి సేవల కాలపరిమితి ఐదేండ్ల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. వివాదం స్వభావాన్ని పరిగణలోకి తీసుకొని కేసుల వారీగా చెల్లించాల్సిన రుసుమును కమిషన్ అధ్యక్షుల చేత నిర్ణయిస్తారని ప్రకటించారు. మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు ద్వారా కేసులు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని వినియోగదారుల కమిషన్-1 సూపరింటెండెంట్ మధుకుమార్ పేర్కొన్నారు.