సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 ( నమస్తే తెలంగాణ )/ కవాడిగూడ : తెలంగాణ శాసనాలకు శ్రీరామోజు హరగోపాల్ చిరునామాగా నిలిచారని పలువురు చరిత్రకారులు, రచయితలు కొనియాడారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్లోని రవ్వా శ్రీహరి వేదికపై గురువారం శ్రీరామోజు హరగోపాల్ రచించిన ‘కొత్త తెలంగాణ శాసనాలు’ గ్రంథాన్ని చరిత్రకారులు డా. దామరాజు సూర్యకుమార్ ఆవిష్కరించారు. చరిత్రకు శాసనాలు ప్రాణప్రదమైన ఆధారాలు అని సూర్యకుమార్ తెలిపారు. శాసనాలు లేకపోతే చరిత్రకు శ్వాస లేదని అన్నారు. అనంతరం పర్యావరణ వేత్త మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ.. శతాబ్ధంలో వెలికి చూడని శాసనాలను రెండు దశాబ్దాలలో హరగోపాల్ వెలుగులోకి తెచ్చే కృషి చేశారని చెప్పారు.
అనంతరం డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో శాసనాలు క్రీస్తుకు పూర్వం నుంచే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్బీఎఫ్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కో కన్వీనర్ బీవీ భద్రగిరీష్, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, వేముగంటి మురళీకృష్ణ పాల్గొన్నారు. అనంతరం రవ్వా శ్రీహరి వేదికపై ప్రముఖ సాహితీ విమర్శకుడు సంగిశెట్టి శ్రీనివాస్తో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, కవి ఉడారి నారాయణ, గుడిపల్లి నిరంరజన్, రాపోలు తదితరులు పాల్గొన్నారు.
అదే వేదికపై సీనియర్ జర్నలిస్టు టీవీఆర్ కృష్ణ పరిశోదన చేసిన గ్రంథం ‘ఆధునిక తెలుగు సాహిత్య సంస్థలు’ గ్రంథాన్నీ ప్రముఖ సాహితీవేత్త నరహరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్, డి. చంద్రశేఖర్, జూలూరు గౌరీ శంకర్, ప్రొఫెసర్ రజినీ, రాపోలు తదితరులు పాల్గొన్నారు. అలాగే డాక్టర్ కత్తి పద్మారావు రచించిన ‘ఈ దేశం మాది’ కవితా సంపుటిని బుక్ ఫెయిర్లో ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే కురుగంటి కళా క్షేత్రం బాలలు నృత్య గురు రాధిక ఆధ్వర్యంలో రవ్వా శ్రీహరి వేదికపై చేసిన ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకున్నది. సోలో నృత్య పోటీల్లో మొదటి బహుమతిగా అపూర్వ, రెండో బహుమతి విజేతగా ఆద్య, మూడో విజేతగా నివేదిత, కన్సొలేషన్ బహుమతి అభిజిత గెలుచుకున్నారు. వీరికి హెచ్బీఎఫ్ అధ్యక్షుడు జూలురు గౌరీశంకర్ బహుమతులు ప్రదానం చేశారు.