సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): పతి ఔర్ పత్ని కలిసి టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారు.. భార్య కోసం ఒకరు ప్రశ్నాపత్రం కొనుగోలు చేయగా.. మరొకరు భార్యతో కలిసి ప్రశ్న పత్రం విక్రయం దందా చేశాడు.. మరొకడు భార్యతో కలిసి పరీక్ష రాసి సిట్ దర్యాప్తులో అడ్డంగా దొరికిపోయారు. పేపర్ లీకేజీ ఘటనలో లోతైన దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. గ్రూప్-1,ఏఈ, ఏఈఈ, డీఏఓ, టౌన్ప్లానింగ్ తదితర పరీక్ష పత్రాలను లీక్ చేసిన ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి ఆయా పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను వివిధ గ్రూప్ల ద్వారా బయటకు విక్రయించడం, బంధువులకు, స్నేహితులకు చేరవేశారు. ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో, తమ భార్యలతో పరీక్ష రాయించి ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయాలని ప్లాన్ చేశారు. ప్రధాన నిందితుడైన రాజశేఖర్రెడ్డి, తన భార్య సుచరితతో డీఏఓ పరీక్ష రాయించి సిట్కు దొరికిపోయాడు. అలాగే, రాజేశ్వర్, అతడి భార్య శాంతి ఇద్దరూ డీఏఓ పరీక్ష రాసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్స్గా నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన సాయిలౌకిక్ తన భార్య సుష్మిత కోసం పేపర్ను కొనుగోలు చేసి సిట్కు దొరికిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితులతో కలిసిపోయి పేపర్ను బయట విక్రయించడంలో రేణుక, ఆమె భర్త ఢాక్య నాయక్ కలిసి ఇతరులకు విక్రయించారు. ఇప్పటికే ఈ నాలుగు జంటలను సిట్ అరెస్ట్ చేసింది.
క్షుణ్ణంగా దర్యాప్తు…!
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజశేఖర్రెడ్డితోపాటు రాజేశ్వర్ కూడా అరెస్టయ్యాడు. ఇందులో రాజేశ్వర్కు బెయిల్ వచ్చింది. రాజేశ్వర్ డీఏఓ (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్) పరీక్ష రాసి టాప్ మార్కులు సాధించడం, అతడి భార్య శాంతి కూడా టాప్ స్కోర్ తెచ్చుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. రాజశేఖర్రెడ్డి భార్య సుచరిత కూడా లీకైన పేపర్తో పరీక్ష రాసినట్లు వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరూ అరెస్టయిన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించలేదు. అయితే, సిట్ అధికారులు వాళ్లు చెప్పిన విషయాలను అన్ని కోణాల్లో విశ్లేషించారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు ఎంతమంది హాజరయ్యారు.. వారి మార్కులు.. వారికి లీకేజీ కేసులో నిందితులుగా ఉన్నవారితో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ప్రత్యేకంగా ఒక బృందం ఈ లింక్లను గుర్తించేందుకు సిట్లో పనిచేస్తుంది. నిందితులకు ఉన్న సంబంధాలు, అలాగే పరీక్ష రాసిన వారందరికీ ఉన్న లింక్లను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తూ నిందితులను గుర్తించారు. ఈ క్రమంలోనే డీఏఓ పరీక్షలో టాప్ మార్కులు సాధించిన వారి గూర్చి ఆరా తీయడంతో నిందితుల లింకులు బయటపడ్డాయి. నిందితుల భార్యలే డీఏఓ పరీక్ష రాసినట్లు సిట్ విచారణలో బయటపడటంతో గత బుధవారం వీరందరిని అరెస్ట్ చేశారు.