ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 2 : కేపీహెచ్బీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను ఆహ్లాదకరమైన పార్కులుగా.. క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని డైమండ్ ఎస్టేట్ కాలనీలో నూతనంగా అభివృద్ధి చేసిన పార్కును ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కూకట్పల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. పురాతనం డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ వ్యవస్థలన్నింటినీ పునరుద్ధరించడం జరిగిందన్నారు. అంతర్గత రోడ్లతో పాటు పార్కులు, క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కాలనీలో మోడల్ రైతుబజార్, ఫిష్ మార్కెట్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, మోడల్ మార్కెట్లు, జీహెచ్ఎంసీ క్రీడా ప్రాంగణాల అభివృద్ధితోపాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్, అండర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. క్రీడాకారుల కోసం ఇండోర్ షటిల్ కోర్టులు, ఓపెన్ జిమ్లు, స్విమ్మింగ్ఫూల్స్, క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కేపీహెచ్బీ కాలనీలో అభివృద్ధి చేసిన మహిళలు, చిల్డ్రన్స్ పార్కు అందుబాటులోకి వస్తుందన్నారు. పార్కులను, క్రీడా ప్రాంగణాలను ప్రజలందరూ సద్వినియోగం ఆరోగ్యవంతంగా జీవించాలని కోరారు. ఈఈ సత్యనారాయణ, డీఈలు ఆనంద్, శ్రీదేవి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం..
క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని.. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్ సీనియర్ సిటిజన్స్ భవనంలో నిర్వహించిన క్యారమ్స్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీనియర్ సిటిజన్స్ కాలక్షేపానికి అన్ని వసతులు కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు గంగిరెడ్డి, కోటేశ్వర్రావు, వెంకటయ్య, సుబ్బారావు, కేవీఎం రెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరులున్నారు.