హైదరాబాద్ : తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో తండ్రికి ఎల్బీనగర్ కోర్టు 15 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2018లో నేపాలీ జాతీయుడు తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేశాడు. అయితే ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తండ్రిని మంగళవారం పోలీసులు ఎల్బీనగర్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి 15 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికలకు రూ. 6 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బాధిత బాలికల వయసు ఒకరిది 17 ఏండ్లు కాగా, మరొకరిది 18 ఏండ్లు. వీరిద్దరూ ఒక ప్రయివేటు పాఠశాలలో చదువుతున్నారు. వాచ్మెన్గా పని చేసే తండ్రి.. కూతుళ్లపై పదేపదే అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. బాధిత బాలికలు ఈ విషయాన్ని తమ బంధువులకు తెలుపగా, వారు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.