కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 14: నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి.. మనస్తాపంతో ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ రాంనారాయణ కథనం ప్రకారం.. జీడిమెట్లలోని చంద్రోదయ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో ఉంటున్న అరవింద్, వీను జస్వాల్ దంపతుల కుమారుడు పీయూష్ జస్వాల్(22) సుచిత్రలోని ఓ ఇనిస్టిట్యూట్లో నీట్ లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. శనివారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూశాడు. ఆ తర్వాత అందరూ కలిసి హాల్లోనే పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తన ఇనిస్టిట్యూట్ గ్రూప్లో ‘సారీ ఫ్రెండ్స్.. తాను చనిపోవాలని అనుకుంటున్నాను..
సారీ అమ్మా నాన్న’.. అని మెసేజ్ పెట్టి.. తాను ఉంటున్న ఇంటి బాల్కనీలోని ఐదో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. అయితే, గ్రూప్లో వచ్చిన మెసేజ్ చూసిన తోటి ఫ్రెండ్స్.. పీయూష్ తల్లి వీను జస్వాల్కు ఫోన్చేసి.. మెసేజ్ గూర్చి చెప్పారు. వెంటనే ఆమె బాల్కనీలోకి వెళ్లి చూడగా.. కిందపడిపోయిన కొడుకు కనిపించాడు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు తాను తీసుకుంటున్న లాంగ్టర్మ్ కోర్సులోని కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో పాటు రాబోయే నీట్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించడం కష్టమని భావించి ఉంటాడని, దీంతో అతడు మనస్తాపం చెంది మృతి చెందినట్లు సమాచారం. మృతుడి తండ్రి అరవింద్ జస్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.