దుండిగల్, మే 2 : రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిట్టల్ మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నివాసముంటున్న వాటిని 58, 59 జీవోల ద్వారా ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేస్తున్న క్రమంలో నవీన్మిట్టల్ పర్యటన ప్రధాన్యతను సంతరించుకున్నది. ప్రధానంగా ఆయన కుత్బుల్లాపూర్ మండలంలోని నర్వేనంబర్ 79, మెట్కానిగూడ, దేవేందర్నగర్, కైసర్నగర్లతో పాటు బాచుపల్లి మండలంలోని నిజాంపేట్లోని సర్వేనంబర్ 233, బాచుపల్లిలోని సర్వేనంబర్ 51, 52, గండిమైసమ్మ-దుండిగల్ మండలంలోని సర్వేనంబర్ 168 భూములను పరిశీలించారు.
ఇప్పటికే సదరు స్థలాల్లో పెద్దసంఖ్యలో నిర్మాణాలు వెలువగా ఆయా స్థలాలను క్రమబద్దీకరించే విషయంపైనే నవీన్మిట్టల్ పర్యటన జరిగినట్లు తెలుస్తున్నది. ఇవన్నీ కూడ అత్యధిక విలువైన భూములు కావడంతో వీటికి ప్రత్యేకంగా ఎక్కువ ధరను నిర్ణయిస్తే రెగ్యూలరైజ్ చేసుకుంటారా..? అని పరిశీలించినట్లు తెలిసింది. దీంతో రెవెన్యూశాఖ సీఎస్ పర్యటన ప్రధాన్యతను సంతరించుకున్నది. ఆయన వెంట మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, జేసీ ఏనుగు నర్సింహారెడ్డి, మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య, తదితరులు ఉన్నారు.