Holi | సిటీబ్యూరో, మార్చి 24(నమస్తే తెలంగాణ): ‘కొట్టు..కొట్టు..కొట్టు.. రంగుతీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ నగరవాసులు హుషారుగా హోలీని జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలో పలు సంస్థలు, హోటళ్లు, రిసార్ట్లు హోలీ వేడుకలకు ఏర్పాట్లు చేశాయి. రంగులు చల్లుకుంటూ సందడిగా గడిపేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ రెడీ అయ్యారు. కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్, అమీర్పేట్, దిల్సుక్నగర్ తదితర ప్రాంతాల్లో హోలీ సామగ్రి దుకాణాలు సందడి తలపిస్తున్నాయి. కాగా, రసాయనాలు కలిగిన రంగులను చల్లుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సహజ రంగులనే వినియోగించాలంటూ హితవు పలికారు. సింథటిక్, డార్క్ కలర్స్ వాడకపోవడం మంచిదని తెలిపారు.
శరీరాన్ని ఎక్కువగా కప్పివుంచే దుస్తులు వేసుకోవడం ఉత్తమమని సూచించారు. సింథటిక్ రసాయన రంగులను ఎక్కువగా వినియోగిస్తున్నారని, అవి నేత్ర దృష్టి పరంగా తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు, కొన్ని సార్లు తాత్కాలిక అంధత్వం వస్తుందని తెలిపారు. కండ్ల చుట్టూ ఉన్న ఛర్మం చాలా సున్నితంగా ఉంటుందని, కొబ్బరి నూనె, బాదం నూనెతో ఛర్మానికి రాస్తే స్కిన్ పాడవకుండా ఉంటుందని చెబుతున్నారు. కండ్లకు స్పెట్స్ వినియోగించాలని సూచించారు. కండ్లల్లో రంగులు పడినప్పుడు వీలైనంత తొందరగా శుభ్రం చేసుకోవాలన్నారు. ఒక వేళ కండ్లు ఎర్రబడితే, దురదగా అనిపించినా, కండ్ల నుంచి నీరు వస్తున్నా, రక్తస్రావం అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. హోలీలో వాడే నీటి బెలూన్స్కు దూరంగా ఉంటే మంచిదన్నారు. కాంటాక్ట్ లెన్స్లు వాడకూడదన్నారు.