మెహిదీపట్నం, జూన్ 27 : కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో మంగళవారం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, దక్షిణ , పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ ఖరె ప్రభాకర్తో కలిసి పర్యటించారు. బక్రీద్ నేపథ్యంలో ఇతరులకు ఇబ్బందులు కల్గించకుండా జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు వ్యర్థాల తొలగింపులో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, ఎంఐఎం కార్పొరేటర్ల ప్రతినిధులు మహ్మద్ హరూన్ ఫర్హాన్, వజీ ఉజ్జమాసిద్ధిఖీ, బద్రుద్దీన్ పాల్గొన్నారు.
మైత్రి, పీస్ కమిటీ నాయకులతో సమావేశం
ప్రజలు పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ఖరె ప్రభాకర్ అన్నారు. మంగళవారం గోల్కొండ పోలీస్ స్టేషన్లో మైత్రి, పీస్ కమిటీ నాయకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్తో పాటు కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న డీసీపీ కిరణ్ కరె ప్రభాకర్ మాట్లాడుతూ.. గోల్కొండ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ నెల 29 న బక్రీద్, గోల్కొండ బోనాల మూడో పూజ ఉన్నందున ప్రజలందరూ సంయమనం పాటించాలన్నారు. బక్రీద్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మైత్రి, పీస్ కమిటీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బక్రీద్ సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తాము పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ ఆర్జీ.శివమారుతి, జీహెచ్ఎంసీ సర్కిల్ -13 డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, మైత్రి, పీస్ కమిటీ అధ్యక్షుడు సిరుగుమల్లె రాజు వస్తాద్, నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, నాయకులు జైనుల్లాబెదిన్ ఆబేద్, వినాయక దయానంద్, మహ్మద్ హరూన్ ఫర్హాన్ పాల్గొన్నారు.
సామూహిక ప్రార్థనలకు ఏర్పాట్లు చేపట్టండి
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు జరుపుకునే సామూహిక ప్రార్థనలలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అహ్మద్నగర్, విజయ్నగర్ కాలనీ, మల్లేపల్లి, రెడ్హిల్స్ డివిజన్లలో ఉన్న ఈద్గా మైదానాలను ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ సర్కిల్ -12 ఈఈ లాల్సింగ్, ఏఎంఓహెచ్ డాక్టర్ విజయ్లతో కలిసి సందర్శించారు. సామూహిక ప్రార్థనలకు వచ్చే వారికి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.