హైదరాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) గతంలో చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై నాంపల్లి సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 2012 డిసెంబర్లో నిజామాబాద్, నిర్మల్లో పర్యటించిన అక్బరుద్దీన్.. హిందువులను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై నమోదైన కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. దాదాపు 30 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ వాదనలు తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించనుంది.
ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దించారు. ఎలాంటి తీర్పు వెలువడినప్పటికీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.